జగన్ గెలుపు ఆపలేం… :నిఘా వర్గాలు ?
కడప : ఉప ఎన్నికలో యువనేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి గెలుపు ఆపలేమంటూ ఇంటెలిజెన్స్ యంత్రాంగం ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంటెలిజెన్స్ ఎస్పీ వెంకట్రామిరెడ్డి, డీఐజీ బాలసుబ్రహ్మణ్యం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా తిష్టవేసి ఉన్నారు. కడప పార్లమెంట్ పరిధిలో వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించి అధికార పార్టీ గెలుపు అసాధ్యమని ప్రభుత్వానికి స్పష్టంచేసినట్లు తెలిసింది.
ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను నివేదిస్తున్నారు. ముందుగా నియోజకవర్గాలవారీగా సమాచారం సేకరించిన నిఘా వ్యవస్థ ప్రభుత్వానికి నివేదిక అందజేసి వైఎస్ జగన్ గెలుపు అతి సునాయాసమని తేల్చినట్లు తెలిసింది. ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికపై సమీక్షించి, పార్లమెంటు పరిధిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెజార్టీ తగ్గించే అంశాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది.
దీంతో మండలాల వారీగా నాయకుల బలాలు, బలహీనతలపై దృష్టి సారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల నేతల బలహీనతలు, పార్టీ ప్రభావం మెండుగా ఉన్న గ్రామాల్లో చేపట్టాల్సిన అంశాలు, అధికార పార్టీ నేతల శైలి తదితర విషయాలపై సమగ్ర నివేదికలు తయారు చేసినట్లు తెలిసింది. ఈ నివేదికలపై ఇంటెలిజెన్స్ ఎస్పీ, డీఐజీ స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
జిల్లాలో రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడం ఉపయోగమా? అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు నాలుగు రోజులుగా నిఘా విభాగం ఉన్నతాధికారులు జిల్లాలో ఉండిపోయారు.