
’14న బాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు’
కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో కమలాపురంకు చేరుకొని అక్కడ జన్మభూమి-మా వూరుకు హాజరవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో కడప విమానాశ్రయానికి చేరుకుని దాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి అశోక్గజపతి రాజు వస్తున్నట్లు సీఎం రమేష్ వివరించారు.