
వైఎస్ జగన్ – పులివెందుల
జగన్కు షరతులతో కూడిన బెయిల్
క్విడ్ ప్రో కో కేసులో అరెస్టయి, 16 నెలలుగా జైలులో ఉన్న కడప పార్లెంటు సభ్యుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… సోమవారం జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ‘కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది’ అని సీబీఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు, పలు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయన్న సీబీఐ వాదనను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.
“దర్యాప్తు సమయంలోనేకాక, కేసు విచారణ సందర్భంగా కూడా నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనను గుర్తించాం. అయితే… అలాంటి ఆరోపణలకు సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది” అని కోర్టు అభిప్రాయపడింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితుడు సంజయ్ చంద్ర విషయంలో సుప్రీంకోర్టు ఇదే వెల్లడించిందన్నారు.
“జగన్ కేసులో సాక్ష్యాల తారుమారుపై కోర్టుకు సీబీఐ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు. అందువల్ల నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించలేకపోతున్నాం.
[box type=”warning” ]
షరతులు
- రూ.2 లక్షల విలువైన పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలి.
- కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదు.
- కేసులో వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.
- దర్యాప్తునకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆటంకాలు కల్పించినా, షరతులను ఉల్లంఘించినా… బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు.
ఒకవేళ… అలాంటి ఆధారాలు లభిస్తే, వాటిని ఎప్పుడైనా కోర్టుకు సమర్పించి, నిందితుడి బెయిల్ రద్దు కోరే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుంది” అని సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు తెలుపుతూ జగన్కు బెయిల్ మంజూరు చేశారు.
సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తీర్పు వెలువడటం, పూచీకత్తుల సమర్పణ కు సమయం లేకపోవడంతో జగన్ వెంటనే విడుదలకాలేదు. లాంఛనాలు పూర్తయిన అనంతరం మంగళవారం జగన్ విడుదల కానున్నారు.
అంతకు ముందు కోర్టులో దాఖలు చేసిన మెమోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సాండూర్ పవర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ/బ్రహ్మణీ ఇన్ఫ్రా, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ లలో ఎటువంటి ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలూ జరగలేదని సీబీఐ నివేదించింది.
కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి 2010లో పార్టీని వీడిన జగన్ తన సంస్థలోకి క్విడ్ ప్రో కో ప్రాతిపాదికన పెట్టుబడులు సేకరించారన్నఆరోపణలపై సిబిఐ ఆయనను 2012 మే 27న అరెస్టు చేసింది.