కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వోలకు వినతిపత్రాలను సమర్పించారు.
పులివెందులలో మాజీ మంత్రీ వివేకానందరెడ్డి, వేముల, వేంపల్లెలలో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్రెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి, జమ్మలమడుగులో శాసనమండలి సభ్యుడు నారాయణరెడ్డి, మైదుకూరులో రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డిలు పాల్గొన్నారు.
రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కోడూరు, ఓబుళవారిపల్లె, పుల్లంపేటలో కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధర్నాలో పాల్గొన్నారు. బద్వేలు, గోపవరం మండలాల్లో బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పాల్గొన్నారు.
రామాపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి ధర్నా నిర్వహించారు.
కడపలో ఎమ్మెల్యే అంజాద్బాష, నగర మేయర్ సురేష్బాబులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. రాజంపేటలో జిల్లా పార్టీ కన్వీనర్ అకేపాటి అమర్నాధ్రెడ్డి పాల్గొన్నారు. ధర్నాల అనంతరం ఆయా చోట్ల వైకాపా శ్రేణులు స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆది ఈ ఆందోళనకు సైతం దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్లే రాజస్థాన్ లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ మీడియాలో ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి.
మొత్తానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఆందోళనలలో పాల్గోనేట్లు చేయడంలో వైకాపా విజయవంతమయ్యింది.