అన్నమయ్య కథ  (మొదటి భాగం)

అన్నమయ్య కథ (మొదటి భాగం)

అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది.

“చందమామ రావో జాబిల్లి రావో,మంచి
కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో”

ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ అన్నమయ్య పాటలంటే చాలా ఇష్టం.ఆయన పాడుతూంటే అలమేలు మంగమ్మ ఆనందంతో నాట్యం చేసేది.ఇంత గొప్పవాడైన ఆ భక్తుడు గురించి తెలుసుకుందామా మరి!

సుమారు ఆరువందల ఏండ్ల క్రితం నాటి మాట

చదవండి :  మరలి మరలి జయమంగళము - అన్నమయ్య సంకీర్తన

తాళ్ళపాక :

తాళ్ళపాక ముఖద్వారము
తాళ్ళపాక ముఖద్వారము

కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్లపాక అనే గ్రామం ఉంది. అక్కడ రెండు గుళ్ళున్నాయి. ఒకటేమో చెన్నకేశవస్వామి గుడి, ఇంకొకటి సిద్ధేశ్వరస్వామి దేవళం. చెన్నకేశవస్వామి విగ్రహాన్ని జనమేజయ మహారాజు ప్రతిష్ట చేశాడు. ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు వచ్చి పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. వాళ్లల్లొ నారాయణయ్య చాలా ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు.

ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.

ఎందుకు బాబు ఈ అఘాయిత్యం?

నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరు (రాజంపేట తాలూకాలోని ఒక గ్రామం)లో తన బంధువుల వద్ద వుంచాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేశారు. కోదండం¹ వేశారు. కోలగగ్గెర² తగిలించారు. నారాయాణయ్య లేత మనస్సు గాయపడింది.  నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. ఎవరో చెబుతుండగా విన్నాడు – ఊరి చివర చింతలమ్మగుడి పుట్టలో పెద్ద పాముందని. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.

చదవండి :  ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము - అన్నమయ్య సంకీర్తన

(ఇంకా ఉంది)

కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి

1 కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం.

2 కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.

తితిదే వారి ‘శ్రీనివాస బాలభారతి’ పుస్తకమాలలో భాగంగా ప్రచురించిన ‘అన్నమాచార్యులు’ పుస్తకం కోసం కామిశెట్టి  శ్రీనివాసులు గారు పరిశోధించి రాసిన కథ ఇది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే పట్టా పొందినారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వద్ద శిష్యరికం చేసిన వీరు చాలా కాలం పాటు తితిదేలో పనిచేసినారు. తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టుకు,  శ్రీ వెంకటేశ్వరా దృశ్య శ్రవణ ప్రాజెక్టుకూ డైరెక్టరుగా వ్యవహరించినారు. అన్నమాచార్య సంకీర్తనలకు వ్యాఖ్యానాలు రాసినారు. తాళ్ళపాక కవుల జీవిత చరిత్రను రాసినారు.

చదవండి :  30వేల పింఛన్‌లు తొలగించారా!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: