కడప: నగరంలోని పాతబస్టాండ్ నుంచి రిమ్స్ ఆసుపత్రికి రోజుకు ఎనిమిది సార్లు తిరిగేలా సోమవారం నుంచి ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభమైంది. నగర శివారులో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి కొన్నాళ్లుగా బస్సు సౌకర్యంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆటోలను ఆశ్రయించేవారు.
ఉదయం 8.45 గంటలకు పాత బస్టాండ్లో మొదలయ్యే ఈ బస్సు.. ఏడురోడ్లు, పాతరిమ్స్, కోటిరెడ్డి కూడలి, ఎర్రముక్కపల్లె, కలెక్టర్ బంగళా, శిల్పారామం మీదుగా రిమ్స్కు చేరుకుంటుంది. పాత బస్టాండు నుండి రిమ్స్ కు ప్రయాణ రుసుం పది రూపాయలుగా నిర్ణయించారు.
మొత్తానికి కడప నగరంలో మొదటి సిటీ బస్సు సర్వీసు ప్రారంభమైందన్నమాట. రిమ్స్ సిబ్బంది, విద్యార్థులు, రోగులకూ, శిల్పారామం సందర్శించే వారికి ఈ బస్సు సర్వీసు ఉపయుక్తంగా ఉంటుంది.