రేపటి నుండి జమ్మలమడుగు ఉరుసు

జమ్మలమడుగు: పట్టణంలోని పలగాడి వీధిలో కొలువై ఉన్న సయ్యద్‌ షా బడే గౌస్‌ పీరాఖాద్రి (పెద్ద ఆస్థానముల ) వారి 81వ ఉరుసు మహోత్సవాలు సెప్టెంబర్ 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రస్తుత పీఠాధిపతి సయ్యద్‌ షా గౌస్‌ పీరాఖాద్రి తెలిపారు.

ఇందులో భాగంగా 18 వ తేదీ బుధవారం నిషాన్‌, 19 వతేదీ గురువారం గంధం, 20 వ తేదీ శుక్రవారం ఉరుసు, 21 వ తేదీ శనివారం జియారత్‌తో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కాగా సయ్యద్‌ షా బడే గౌస్‌ పీరాఖాద్రి వారికి ఘన చరిత్ర ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

చదవండి :  కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

క్రీస్తు శకం 1074లో నబీబా అనే నవాబు గండికోటను పాలించేవారు. ఆ కాలంలో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో దివ్య సమాధి యైన గౌస్‌- ఎ- పాక్‌ రహ్మతుల్లా అలై (దస్తగిరిస్వామి) ముని మనవడైన జమాలుద్దీన్‌ సాహేబ్‌ ఇస్లాం మత దివ్యసందేశాన్ని ప్రచారం చేస్తూ జమ్మలమడుగు పట్టణానికి వచ్చి స్థానిక పలగాడి వీధిలో దివ్యసమాధి అయ్యారు. వీరి వంశానికి చెందిన వారే సయ్యద్‌ షా బడే గౌస్‌ పీరాఖాద్రి. కాగా మహిమాన్వితులైన వీరు 1932లో దివంగతులయ్యారు.

గౌస్‌ పీరాఖాద్రి చనిపోయిన 40 రోజుల తర్వాత శిష్యులు సమాధిని తెరచి చూడగా స్వామి వారి దేహం చెక్కు చెదరకుండా సువాసన వెదజల్లడంతో నాటి నుండి స్వామి వారిని భక్తి ప్రపత్తులతో కొలిచే వారి సంఖ్య పెరిగింది. కాగా వీరి అయిదవ తరానికి చెందిన వారే ప్రస్తుత పీఠాధిపతి సయ్యద్‌ షా గౌస్‌ పీరాఖాద్రి.

చదవండి :  బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ - పుట్టుక నుండి చావు వరకు

ఉత్సవాల్లో భాగంగా నిషాన్‌ రోజు నగారాలతో జెండాలను ఊరేగింపుగా తీసుకొనివచ్చి స్వామి వారికి అర్పించడం, భక్తులకు శిష్యరికం అందించడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. అలాగే గంధం రోజు నగారాలు, బాణా సంచా వేడుకలతో గంధం బయలుదేరుతుంది. రాత్రి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

కాగా ఉరుసు రోజు రాత్రి 09:00 గంటలకు ముంబైకు చెందిన ఆరీఫ్‌ నాజా అండ్‌ పార్టీ, సయిద్‌ ఫరీద్‌ నిజామి అండ్‌ పార్టీ వారిచే గొప్ప ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. 21 వ తేదీ జియారత్‌తో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయి.

చదవండి :  చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

జమ్మలమడుగు ఖాజీగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పీఠాధిపతి గౌస్‌ పీరా ఖాద్రి పెద్ద ఆస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. పలగాడివీధిలోని కొత్త మసీదు వీరి ఆధ్వర్యంలోనే నిర్మించబడింది. అలాగే గౌసియా షాదీఖానా నిర్మాణానికి, ఉర్దూ ఘర్‌ ఏర్పాటుకు ఉచితంగా స్థలాన్ని ఇచ్చారు భక్తులందరూ ఉరుసు మహోత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని ఆస్థాన్‌ ఎ గౌసియా కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి!

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: