ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

ఒంటిమిట్ట కోదండ రామాలయం

ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు.

విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ లాంఛనాలు దక్కడం అన్ని విధాల న్యాయమని ప్రజలు స్థానిక రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయమై ఇంటాక్ సంస్థ నవంబరు 24న ఒంటిమిట్టలో భారీ ర్యాలీ నిర్వహించింది.

జిల్లాకు చెందిన భాష, చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ముందుకు రావడంతో జిల్లా వాసుల డిమాండ్‌కు మరింత బలం చేకూరింది.

ఒంటిమిట్ట ఆలయానికి రాజలాంఛనాలు సమర్పించాలని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒక్కటిగా కలిసి డిమాండ్ చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంటిమిట్ట, తాళ్లపాకలతోపాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించనున్నారు.

ఒంటిమిట్ట విషయంలో వ్యవహరించినట్లుగానే జిల్లా ప్రజలు, అన్ని పక్షాల నాయకులు కలిసికట్టుగా ఉద్యమించి జిల్లాకు అభివృద్ది పనులను సాధించుకోవాలని ఆకాంక్షిద్దాం!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: