ఆకట్టుకున్న అలెగ్జాండర్ నాటక ప్రదర్శన

పదవీవిరమణ పొందిన మేజర్ పాత్రలో జయప్రకాష్ రెడ్డి

ఆకట్టుకున్న అలెగ్జాండర్ నాటక ప్రదర్శన

ప్రొద్దుటూరు: సినిమా నటుడు జయప్రకాశ్‌రెడ్డి ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకం ఆహూతులను కడుపుబ్బా నవించింది. స్థానిక జార్జిక్లబ్ సభాభవనంలో ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 18వ వార్షికోత్సవం ముగింపు సభ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి అలెగ్జాండర్ నాటకాన్ని ప్రదర్శించినారు. ఇందులో పదవీ విరమణ పొందిన మేజర్ పాత్రను పోషించిన జయప్రకాశ్‌రెడ్డి ఆద్యంతం నాటకాన్ని రక్తి కట్టించారు. కుటుంబ వివాదాల నడుమ ఒంటరి జీవితం గడపాలని నిర్ణయించుకున్న మేజర్ నామజిక రుగ్మతలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక హెల్ప్ లైన్ ప్రారంభించడం, ఆ తర్వాత హెల్ప్ లింకు ఫోన్ చేసే వారి సమస్యలకు మేజర్ చెప్పే సమాధానాలు నేపధ్యంగా నాటకం నడుస్తుంది. అనంతరం జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ నిజాయితీ, అభిమానం, క్రమశిక్షణకు మూలఖండమని అభివర్ణించారు.

వార్షికోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా అభిమానానికి అడ్డా అన్నారు. సురభి కళాసంస్థ, సినీ కళామా పుత్రులైన నాగిరెడ్డి, బిఎన్ రెడ్డి, పద్మనాభంలు ఇక్కడే పుట్టారని గుర్తు చేశారు. సినిమాలకు నాటకాలే మూలమన్నారు.

తర్వాత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ నాటక కళా క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీవీ ధారావాహికలు, సినిమాలు, చరవాణిలతో నేటితరం పెడదోవ పట్టిందన్నారు. వాటినుంచి విముక్తి లభించాలంటే నాటక కళలకు తిరిగి జీవం పోయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, వైద్యుడు నాగదస్తగిరిరెడ్డి, మూలె రామమునిరెడ్డి, ప్రభుకుమార్ పాల్గొన్నారు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: