
Image courtesy : The Hindu
సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె
కరువుటెండలో వాడిపోతున్న
మట్టిపూలు రాలిపోతున్నాయి
వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు
నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు
మేఘాల చినుకుల కోత
కరువులో ఆకలిమంటల కోత
నిరంతరం
సీమలో రైతన్నలకు రంపపు కోత
పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న
ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు
పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన
కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది
బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు
కాలం
సంకెల్లువేసి వికట్టాటహాసం చేస్తుంది
మట్టిమీద సంతకం చేయాల్సిన వానచినుకు
మబ్బుతునక కౌగిట్లో బంధీగామారింది
ఇంటిగుమ్మానికి ధీనంగా వేలాడే
ఎండిపోయిన మామిడి ఆకుల్లా
పొలాల గట్టున దిగాలుగా కూర్చొన్న
రైతన్నలు..
జీవశ్ఛవాలుగా కనిపిస్తున్నారు
సంగటిబువ్వ..రాగిముద్ద
తినిపించాల్సిన చేతులు
గంజినీల్లకోసం తడబడుతున్నాయి
ఆశనిరాశల
ఆకాశం నుండి రాలిన నాలుగుచినుకులు
మరణపత్రాలను రాసి వెల్లిపోతున్నాయి
అన్నదాతల ఆకలి రాజ్యంలో
అన్నం మెతుకులకోసం వలసలు ధీనంగా..
గుండెపగుల్లలో చిమ్మిన రక్తంతో
రంగుల రాజకీయానికి స్నానం చేయించాలి
కరువురైతుల కన్నీటి సముద్రంలో
కొత్తసూర్యుడు ఉదయించాలి..!
[author image=”https://kadapa.info/wp-content/uploads/2014/12/jagadish_kere2.png” ]
ముప్పది యేండ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్న జగదీశ్ కెరె గారు కన్నడ కుటుంబంలో పుట్టిన ఒక తెలుగు కవి, చిత్రకారులూ! 07-01-1955న అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వీరు జన్మించారు. బి కాం పట్టభద్రులైన వీరు హిందీ బాషలో విశారద చేశారు. 2011 లో వీరు రాసిన ‘సముద్రమంత గాయం’ అనే కవితా సంపుటి, 2012 లో అంధుల జీవితాలపై రాసిన ‘రాత్రిసూర్యుడు’ అనే దీర్ఘకావ్యం పుస్తకాలుగా వెలువడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో పాత్రికేయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
[/author]