
రామసుబ్బారెడ్డి (ఫైల్ ఫోటో)
ఢిల్లీలో మకాం వేసిన ప్రత్యర్థులు
జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ
జమ్మలమడుగు: షాద్నగర్ జంట హత్యల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బుధ,గురువారాల్లో విచారణతోపాటు తుదితీర్పు వెలువరిస్తుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నారు. గత ఆగస్టు 21న, సెప్టెంబర్ 18 వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే రెండు సార్లూ వారుుదా పడింది.
1990లో షాద్నగర్లో దేవగుడి శంకర్రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్రెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో 11మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఒకరు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2004లో రామసుబ్బారెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కొంతకాలం ఆయన జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. అనంతరం కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఈ కేసును ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. జడ్జీలు భాను, మీనాకుమారిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెరో రకంగా ఇచ్చారు. దీంతో హైకోర్టు జడ్జి బిలాల్ నక్వీ రామసుబ్బారెడ్డి నిర్దోషి అంటూ తీర్పు నిచ్చారు. ఫలితంగా రామసుబ్బారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ తీర్పుపై స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009లో ప్రత్యేక ధర్మాసనంలో పిటిషన్ అడ్మిట్ అయింది.
ఢిల్లీలో మకాం వేసిన నాయకులు…
షాద్నగర్ జంట హత్యలకు సంబంధించిన కేసు బుధ, గురువారాల్లో తీర్పు వెలువడుతుందనే ఉద్ధేశ్యంతో స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఈకేసును సుప్రీం కోర్టు కొట్టేస్తుందని టీడీపీ నాయకులు భావిస్తుండగా, ఎమ్మెల్యే ఆది వర్గీయులు మాత్రం తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.