
కమిటీ సమావేశం జరుగుతున్న మందిరంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు
‘శివరామక్రిష్ణన్’కు నిరసన తెలిపిన విద్యార్థులు
కడప: రాజధాని ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపేందుకు ఈ రోజు కడపకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీకి విద్యార్థుల నుండి నిరసన ఎదురైంది. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు శివరామకృష్ణన్ కమిటీ సమావేశం జరుగుతున్న హాల్ లోకి దూసుకువెళ్లి తమ నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు కమిటీ రాకను నిరసిస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఈ సందర్బంగా వారు కోరారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అక్కడి నుండి ఒకటో పట్టణ పోలీసు స్టేషనుకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు
జాతీయ స్థాయి ప్రాజెక్టులన్నీ కోస్తాంధ్ర ప్రాంతానికే పంచేసి రాయలసీమ వాసులను మోసం చేసేందుకే శివరామకృష్ణన్ కమిటీ పేరుతో నాటకం ఆడుతున్నారని రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆరోపించింది.
రాయలసీమ ప్రజల హక్కుల పత్రం అయిన శ్రీబాగ్ ఒడంబడికకు సమాధి కట్టడానికే కుట్ర పూరితంగా కమిటీ వేశారని ఆర్ఎస్ఎఫ్ దుయ్యబట్టింది.

కమిటీకి వినతిపత్రం ఇచ్చిన తరువాత జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వెనుకుబాటు తనాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిని కడపలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తమను వేదించినా ఫర్వాలేదు కాని ప్రజలను వేధించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ప్రజలను వేధించరాదని అన్నారు. కడపను రాజధానిని చేస్తామంటే, అవసరమైతే తామంతా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి సంతోషంగా తప్పుకుంటామని అన్నారు.