‘అందరూ ఇక్కడోళ్ళే … అన్నీ అక్కడికే’
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు.
జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్హౌస్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సారవంతమైన మాగానిలో భూములను కొనుగోలు చేసి రాజధానిని నిర్మించడం వల్ల పచ్చని పంటపొలాలను పోగొట్టుకుంటామన్నారు. రాయలసీమలో గడ్డికూడా మొలవని భూములున్నాయని చెప్పారు.
ఒక నాడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయిన ఆంధ్రరాష్ట్రానికి అభివృద్ధి చెందని రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. అదికూడా అప్పట్లో జరిగిన శ్రీభాగ్ ఒప్పందంలో భాగమేనన్నారు. అది విశాలాంధ్ర ఏర్పాటు కారణంగా కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధానిని తీసుకెళ్లేప్పుడు రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేట్లు ఒప్పందం చేసుకున్నారని వివరించారు. అది నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు.తీరా ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాజధాని ఏర్పాటుకు ఇచ్చే నిధులతో కోస్తా ప్రాంతంలోనే అభివృద్ధి చేసుకుని తేడా వస్తే మళ్లీ రాయలసీమ వాళ్లను పోండంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయేప్పుడు 1956కు ముందు ఎలా ఉందో అలాగే తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం విడిపోవాలని అనుకున్నారన్నారు. కానీ రాజధాని ఏర్పాటు ప్రకటించకుండా మెలిక పెట్టి అన్యాయం చేశారన్నారు.