
అమర్నాద రెడ్డి ఆకేపాటి – రాజంపేట
30వేల పింఛన్లు తొలగించారా!
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు.
ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన విమర్శించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టకొట్టిన ప్రభుత్వానికి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందన్నారు. పింఛన్లకు అనేక రకాల అడ్డంకులు సృష్టించి అర్హులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజల పక్షాలన పోరాటం చేస్తామన్నారు.
దివంగత వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకే టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదనే విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.