సొంత భజనతో తరించిన ముఖ్యమంత్రి

హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి

సొంత భజనతో తరించిన ముఖ్యమంత్రి

కడప: జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజు (శనివారం) కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం ప్రభుత్వ పథకాలను, ఘనతలను వల్లె వేయటానికి ప్రాధాన్యమిచ్చారు.  గతంలో జిల్లాకు ఇచ్చిన హామీలను గానీ, వాటి పురోగతిని గాని వివరించేందుకు కనీస ప్రయత్నం చెయ్యలేదు. ఆలంఖాన్ పల్లెలో జరిగిన ‘జన్మభూమి – మా ఊరు’ గ్రామ సభలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంతకు ముందు 44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన హజ్ హౌస్ (12 కోట్లు), వివిధ చిన్న చిన్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గతంలో చేపట్టి పూర్తయిన 38 చిన్న చిన్న పనులకు (సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్మించిన వసతి గృహాలు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల భవనాలు, స్త్రీ శక్తి భవనాలు మొ||నవి) ప్రారంభోత్సవాలు చేశారు. ప్రారంభోత్సవాలు చేసిన పనుల విలువ 63.4 కోట్లు (ఆధారం: DPRO)

అనంతరం గ్రామసభలో చంద్రబాబు మాట్లాడుతూ… ఆహార భద్రత కింద సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగల సందర్భంగా రేషన్ కార్డులు కలిగిన 12.5 లక్షల కుటుంబాలకు ఉచితాలు (సరుకులు) అందజేస్తున్నామన్నారు. సింగపూరు, దుబాయ్ ల మాదిరిగా ప్రజలు కష్టపడి పనిచేసి అభివృద్దిలోకి రావాలన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కడప నగరంలో బుగ్గవంకను సుందరీకరిస్తామన్నారు. కడప నుంచి హైదరాబాదు, బెంగులూరు, అమరావతి నగరాలకు విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ కేబుల్ నెట్వర్క్ పథకం కింద 120 రూ.కే కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోను సౌకర్యం కల్పిస్తామన్నారు.   వివిధ ప్రభుత్వ పథకాలను గురించి ఏకరువు పెట్టారు. అనంతరం పది రూపాయలకు ఎల్ఇడి దీపాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామసభలో పాల్గొన్న జిల్లా కలెక్టరు రమణ మాట్లాడుతూ… ముఖ్యమంత్రిని పొగడ్తలతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాధరెడ్డి, శాసనమండలి ఉపాధ్యక్షుడు ఎస్వీ సతీశ్ రెడ్డి, పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ లింగారెడ్డి, పలువురు తెదేపా నేతలు, జిల్లాకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: