నేటి నుంచి దేవుని కడప బ్రహ్మోత్సవాలు

    కడప: జిల్లాలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం. తిరుమలకు తొలి గడపగా పేరున్న ఈ క్షేత్రంలో యేటా జరిగే తిరుణాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కడప రాయునిగా, వెంకటాద్రి కడప రాయనిగా, కప్పురపు నవ్వుల కడప రాయనిగా భక్తుల పూజలందుకుంటున్న ఈ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకూ నిర్వహిస్తారు. రథసప్తమి నాడు జరిగే రథోత్సవం ‘దేవునికడప’ తిరుణాలగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

    పురాతన ప్రశస్తి:

     కడప నగరానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలోగల ఈ క్షేత్రంలోని స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆయన పేరుతోనే కడప నగరం కృపానగరం, కురుప-కడపగా వ్యవహారంలోకి వచ్చిందంటారు. విజయనగరరాజులు, నంద్యాల రాజులు, మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ, ఆలయ నిర్వహణకు బంగారు ఆభరణాలు, మణిమాన్యాలూ సమర్పించారు. ఈ మేరకు ఆలయ కుడ్యాలపై 13 శిలాశాసనాలు ఉన్నాయి. మారుతాత్మజుడు హనుమంతుడు ఈ క్షేత్ర పాలకుడు. గర్భాలయంలో మూలవిరాట్టు వెనుక 15 అడుగుల ఆంజనేయస్వామి కుడ్య శిల్పం ఉంది.

    చదవండి :  ఉప ప్రచారానికి ప్రచారానికి ఎంపీ సబ్బం

    ఆలయం ఎదురుగా 80 మీటర్ల దూరంలో హనుమంతుని ఆలయం ఉంది. ఉగాది నాడు మహమ్మదీయులు విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకుని భత్యం సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉండిన ఈ ఆలయం 2008లో తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి వచ్చింది. ఈ నాలుగేళ్లలో టీటీడీ ఆలయానికి పటిష్టమైన ప్రహరీ నిర్మించింది. ప్రధాన మండపానికి మరమ్మతులు, ఆళ్వార్ల మండపాలు తదితర నిర్మాణాలు చేయించారు. అంతవరకూ బ్రహ్మోత్సవాల ముగింపుగా ఆలయ సమీపంలోని పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించేవారు. కానీ టీటీడీ తీసుకున్నాక ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు.

    చదవండి :  రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన

    ఈ స్వామి పట్ల దేవునికడప, పాతకడప వాసులు విశేష భక్తి ప్రవత్తులు కనబరుస్తారు. మొన్నటివరకు ఆ గ్రామ వాసులే కమిటీ ప్రతినిధులుగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. నిధులు సమకూర్చారు. రథసప్తమి నాడు ఈ రెండు గ్రామాల యువకులూ రథం రెండు చక్రాలనూ కదిలిస్తూ రథోత్సవానికి సహకరిస్తారు.

    ఏర్పాట్లు పూర్తి:

     సోమవారం నుంచి నిర్వహించనున్న కడప రాయుని బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగులు, పందిళ్లు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. దేవునికడపలోనేగాక అక్కడి నుంచి కృష్ణా సర్కిల్ వరకు, నగరంలోని ముఖ్య కూడళ్లలోనూ విద్యుద్దీపాల కటౌట్లు ఏర్పాటు చేశారు.

    చదవండి :  మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

    ఉత్సవాలలో…

    ఉత్సవాలలో భాగంగా 23న అంకురార్పణం, 24న ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం, 25న సూర్యప్రభ, పెద్ద శేష వాహనాలు, 26న చిన్నశేష, సింహ వాహనాలు, 27న కల్పవక్ష, హనుమంత వాహనాలు, 28న సర్వభూపాల, గరుడ వాహనాలు, 29న కళ్యాణోత్సవం, గజవాహనం, 30న రథోత్సవం (దేవునికడప తిరుణాల), ధూళి ఉత్సవం, 31న ముత్యపు పందిరి వాహనం, అశ్వవాహనం, ఫిబ్రవరి 1న వసంతోత్సవం (చక్రస్నానం), హంసవాహనం, 2న పుష్పయాగం, పాన్పుసేవ నిర్వహించనున్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *