
బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్
ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? – బి.వి.రాఘవులు
‘అనంతపురంతో పాటు వైఎస్సార్జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ‘ అని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పూర్తిచేయాలనే డిమాండ్తో పరిశ్రమ ఏర్పాటు ప్రాంతం నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం కలెక్టరేట్ వద్ద ముగిసింది. నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బివిరాఘవులు మాట్లాడుతూ…
‘ఖమ్మంజిల్లా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. పనులు మొదలై మధ్యలో నిలిచిపోయిన బ్రహ్మణిని పూర్తిచేసే అంశాన్ని ఎందుకు చేర్చలేదు.. తెలంగాణలో ఎన్టీపీసీ పవర్ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.. సీమలో ఆర్టీపీపీ మినహా మరో పవర్ప్రాజెక్టు లేదు. పోలవరం కడతామంటున్నారు. సీమలో మంచినీళ్లుకూడా లేవు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికైనా నిధులు ఇస్తామని ఎందుకు చెప్పడంలేదు.. రాష్ట్రంలో రెండు గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామంటున్నారు… సీమలోని ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధికి బిల్లులో ఎలాంటి ప్రతిపాదనలు చేశారు’ అంటూ కేంద్రప్రభుత్వంపై రాఘవులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆరుగురు సీమ ప్రాంతవాసులు ముఖ్యమంత్రులుగా కొనసాగారని, వారి స్వార్థం చూసుకోవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడలేదని ఆరోపించారు.
సాగునీటితో పాటు పరిశ్రమల స్థాపన అవసరం:
‘సీమలో వ్యవసాయానికి సాగునీరు అవసరమే. దీంతోపాటు పరిశ్రమల స్థాపన కూడా కీలకం. సీమలో 1.20 కోట్ల జనాభా ఉంటే హైదరాబాద్లోనే కోటి మంది ఉన్నారు. హైదరాబాద్కు 10-15 టీఎంసీల నీళ్లు సరిపోతున్నాయి. సీమకు 200 టీఎంసీల వరకూ అవసరమవుతోంది. తక్కువనీళ్లతో ఎక్కువ లబ్ధి చేకూర్చే పరిశ్రమల కోసం ఉద్యమించాలి. కర్నాటకలో ఆల్మట్టి ఎత్తుపెంచితే సీమ సంగతేంటి.. హైదరాబాద్లో పరిశ్రమలు ఉన్నందునే అంత అభివృద్ధి సాధ్యమైంది. సీమలో బ్రహ్మణిని స్థాపిస్తే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. తద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని రాఘవులు అన్నారు. నందలూరు వద్ద గతంలో ఆల్విన్ఫ్యాక్టరీ స్థాపించి కొన్నేళ్లకే మూసేశారని గుర్తు చేశారు.హిందూపురం, మదనపల్లెలో ఐటీ పరిశ్రమలు పెట్టొచ్చు..
సీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచించాలన్నారు. జిల్లా అభివృద్ధి కోసం సీపీఎం చేపట్టినన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు మరేపార్టీ చేపట్టలేదని నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి అన్నారు. సభలో సీపీఎం రాష్ట్రనాయకుడు వెంకట్, జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు ఆంజనేయులు, శ్రీనివాసులరెడ్డి, శివరామకృష్ణారెడ్డితో పాటు మానవహక్కువ సంఘం జిల్లా కన్వీనర్ జయశ్రీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, అన్వేశ్, శివనారాయణ, సుధాకర్, రైతుసేవాసమతి జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డిశ్రీరామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ మృతితో అభివృద్ధి ఆగిపోయింది
బ్రహ్మణి టైం బాగాలేదు. వైఎస్ మృతితో ఫ్యాక్టరీ అర్ధంతరంగా నిలిచిపోయింది. ప్రజల కష్టాలు వైఎస్కు తెలుసు. అందుకే సీమ అభివృద్ధికి పాటుపడ్డారు. పోతిరెడ్డిపాడు, గండికోట, హంద్రీనీవా, గాలేరు-నగరి కోసం శ్రమించారు. వైఎస్ మృతి తర్వాత అభివృద్ధి ఆగిపోయింది. బ్రహ్మణిని పూర్తిచేసేందుకు ఎమ్మెల్యే ఆదితో పాటు నేనూ పోరాడతా..
– దేవగుడినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం:
ఉద్యోగాలు… ఉపాధి కావాలి. ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించే పరిస్థితులు తక్కువ. 1984 లెక్కల ప్రకారమే 325 టీఎంసీలు కావాలి. ఆ ప్రకారం ఇవ్వడం లేదు. మొదటగా నీళ్లకోసం పోరాడాలి. ఆపై పరిశ్రమల కోసం ఉద్యమించాలి. ఈ విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తా.
– గేయానంద్, ఎమ్మెల్సీ.
1.25లక్షల మందికి ఉపాధి
బ్రహ్మణిని నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.25లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. విశాఖలో స్టీల్ప్లాంటు ఏర్పాటు తర్వాత దాని స్వరూపం మారిపోయింది. జిల్లాలో కూడా బ్రహ్మణి స్థాపిస్తే అలాగే జరుగుతుంది.
– నారాయణ. సీపీఎం జిల్లా కార్యద ర్శి