చౌదరి సార్ ఇకలేరు

చౌదరి సార్ ఇకలేరు

చౌదరి సార్ గా ప్రజలతో పిలువబడే డాక్టర్ పి.ఎ.కె .చౌదరి నిన్న కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలో మృతిచెందారు. అయన వయస్సు 70 సంవత్సరాలు.ఇటీవల కాలంలో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉండే వారు.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సిరిపురం గ్రామానికి చెందిన చౌదరి గారు ముప్పై ఏళ్లకిందట వంటరిగా కడప జిల్లా కు వచ్చి వనిపెంట కేంద్రంగా పరిసర గ్రామాల్లో ఆయుర్వేద, ఆర్.ఎం.పీ వైద్యునిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈప్రాంత గ్రామీణులతో మమేకమైపోయిన చౌదరి సార్ ఇక తిరిగి తన స్వస్థలానికి వెళ్ళలేక పోయారు. ముప్పై ఏళ్లపాటు వంటరిగానే ప్రజలమనిషిగా ఉండిపోయారు.

వనిపెంట కేంద్రంగా నడుస్తున్న ఒక స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎం. రాజశేఖర్ రెడ్డి గారితో చాలా ఏళ్ళపాటు కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. గుంటూరు యాసలో చక్కగా వినసొంపుగా మాట్లాడే చౌదరి సార్ నిరుపేదలకు, దళితులకు, గ్రామీణులకు వైద్యసేవలు అందించేవారు. మైదుకూరు కేంద్రంగా గత దశాబ్ద కాలంగా తెలుగు భాషా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా తెలుగు సమాజం కార్యక్రమాల్లో కూడా ఆయన తరచూ పాల్గొనేవారు. రైతు, ప్రజా ఉద్యమాల్లో కూడా విరివిగా పాల్గొనేవారు.

సాహిత్యం, రాజకీయాలు, చరిత్ర ఇలా ఏ అంశం అయినా అనర్ఘళంగా మాట్లాడేవారు. మర్యాదపూర్వక పలుకరింపు, చెరగని చిరునవ్వు చౌదరి సార్ స్వంతం. ఆయన ఆకస్మిక మరణం ఇక్కడి ఆయన అభిమానులను విచారంలోకి నెట్టివేసింది. .అయన మృతదేహాన్ని గుంటూరు జిల్లాలోని సిరిపురం గ్రామానికి శనివారం ఉదయం తరలించారు. డాక్టర్ చౌదరి గారికి ఘన నివాళి అర్పిస్తున్నాము.

  • – తవ్వా  ఓబుల్ రెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: