నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను ఎలాగూ తితిదే వాళ్ళు నూరుకోట్లతో అభివృద్ధి చేస్తున్నారు కదా? అది చాలదన్నట్లు మరీ కక్కుర్తిగా చిన్నాచితకా దేవస్థానాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రెండుకోట్లకు కూడా వాటాకొస్తే ఎట్లా? ఈ నిధులు ఒంటిమిట్టకు బదులు దేవునికడపకు ఇవ్వొచ్చు. ఒకవేళ ఒకేవూర్లో రెండు కేంద్రాలు (దర్గా, దేవుని కడప) వద్దనుకుంటే గండికి ఇవ్వొచ్చు. గండిని తితిదే వాళ్ళు నిలువుదోపిడీ చేసి వదిలిపెట్టాక నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఆలయనిధులు కాస్తా గుండుసున్నా అయిపోయాక దాతలు, భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాలమీదే ఆధారపడుతున్నారు. జిల్లాల స్థాయిలో అయినా, ప్రాంతాల స్థాయిలో అయినా, రాష్ట్రస్థాయిలో అయినా అభివృద్ధిని ఒకేచోట కుప్పపోయడం అనర్థదాయకమని, అది సహజన్యాయ సూత్రాలకు, ప్రభువులు ప్రవచించిన “సమన్యాయ” సిద్ధాంతానికి వ్యతిరేకమని ఎప్పుడు తెలుసుంటారు స్వాములూ? (clipping from Eenadu Kadapa dated 26th July)
ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే దీనికి సరిగ్గా రెండువారాల ముందు పర్యాటక శాఖ ఉన్నతాధికారి, శిల్పారామాల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి చందనా ఖాన్ ఒంటిమిట్టను సందర్శించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు శిల్పారామాల్లో మొదటిదశలో ఒక్కొక్కదాని మీదా మూడు కోట్లు ఖర్చుపెడుతున్నామని, వాటికి అదనంగా ఒంటిమిట్టలో కూడా ఒకటి నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అమ్మా, కడప జిల్లా మాజీ కలెక్టరా!
మీ శాఖ తరపున మా జిల్లాలో ఖర్చుచెయ్యడానికి మూడు కోట్లున్నాయన్నారు, సంతోషం. ఐతే దాంతో ఏం చెయ్యొచ్చో మీ ఈ ప్రతిపాదనతోబాటు అదేరోజు ఈనాడు కడప టాబ్లాయిడ్లో వచ్చిన కథనం చూసినాకైనా మీకొక అంచనా వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మైలవరంలో మ్యూజియం భవనం కట్టడానికి నిధులున్నప్పుడు స్థలం లేక, తీరా స్థలం ఖరారైనాక నిధుల్లేక డోలాయమానంగా ఉంది. మీరు జిల్లాలో మూడో శిల్పారామం కట్టే బదులు ఆ నిధుల్లోనుంచి ఒక కోటి రూపాయలు అటు మళ్ళించండి. ఎందుకంటే..
- ఒంటిమిట్టే ఒక పల్లెటూరు. పల్లెటూర్లలో సజీవంగా చూడగలవాటి నిర్జీవ నమూనాలు చేసిపెట్టడం కోసం కోట్లు ఖర్చుపెట్టడం దండగ.
- కడపలో ఇప్పుడున్న శిల్పారామం, ఒంటిమిట్ట నుంచి కేవలం 21 కిమీ దూరంలో ఉంది. అంత దగ్గర్లో ఇంకొకటి అవసరమా చెప్పండి.
(కింది కథనాలు రెండూ ఒకేరోజు (12/7/2016) ఈనాడులో వచ్చినవే)
పైన నేను రాసిందాన్నిబట్టి ఒంటిమిట్ట అభివృద్ధి చెందడం నాకు ఇష్టం లేదని మాత్రం అనుకోకండి. ఆ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని మించి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఐతే దానికోసం దయచేసి ఇతర చిన్న ఆలయాలకు ఉద్దేశించిన నిధులను వాడుకోవద్దనేదే నా అభిమతం. ముందుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూరుకోట్ల నిధులను తితిదే సత్వరమే విడుదలచేసి వాటితో అనుకున్న విధంగా ఆలయాన్ని అభివృద్ధిచెయ్యనివ్వండి. ఒంటిమిట్టలో అభివృద్ధి ఆశించినస్థాయిలో జరగడం లేదనిపిస్తే తితిదే మీద ఒత్తిడి తీసుకువచ్చి పనులు తొందరగా పూర్తయేట్లు చూడండి. ప్రణాళిక ప్రకారం పనులన్నీ పూర్తిచేసినా ఇంకా అభివృద్ధికి అవకాశం, అవసరం ఉన్నాయనిపిస్తే అప్పుడు నిధుల సమీకరణ కోసం ఏం చెయ్యాలో రాష్ట్రప్రభుత్వం, తితిదే నిర్ణయించుకుంటాయి.
– త్రివిక్రమ్
(trivikram@kadapa.info)