డబ్బులూ, అనుమతులూ ఇవ్వకుండా నీళ్లెలా తేగలరు?

గండికోట జలాశయం ద్వారాలు

డబ్బులూ, అనుమతులూ ఇవ్వకుండా నీళ్లెలా తేగలరు?

కడప: గాలేరు-నగరి పథకంలో భాగమైన గండికోట జలాశయం పూర్తి చేయడానికి అవసరమైన డబ్బులూ, అనుమతులు ఇవ్వకుండా నీళ్లెలా ఇవ్వగలుగుతారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

స్థానిక ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కడప, చిత్తూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని అప్పటి తెదేపా ప్రభుత్వం (ఎన్టీఆర్ హయాంలో) గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా శంఖుస్థాపన చేసిందన్నారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మరోమారు గండికోట (ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి) జలాశయానికి శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తిచేయడానికి అవసరమైన నిధులు కేటాయించలేదన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడమే కాక గాలేరు నగరి పథకానికి సంబంధించి గండికోట జలాశయం వరకూ 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.

అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ తగినన్ని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రెండు జిల్లాల ప్రజల కల సాకారం కాలేదన్నారు.

ముఖ్యమంత్రి, తెదేపా నేతలు, జిల్లా కలెక్టర్ గండికోట ప్రాజెక్టును పరిశీలించిన పూర్తిసామర్థ్యంతో నీటిని నింపుతామని చెప్పడం తప్పా ఆచరణలో పట్టుమని పది టీఎంసీలు కూడా నింపలేకున్నారని విమర్శించారు.

ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నీటిపారుదల ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, చంద్ర పాల్గొన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: