పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

♦ చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే

♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది

♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా?

కడప: ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

చదవండి :  'సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల'

సమగ్ర విచారణ జరిపితే ఆయన ఎంత అవినీతిపరుడో త్వరలోనే బయటపడుతుందన్నారు. వైకాపాను అణగదొక్కడానికి చంద్రబాబు జిల్లాపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వారిని జిల్లాకు చెందిన నాయకుడు ఒకరు బెదిరిస్తున్నారని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికారం, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా అలా బెదిరించే వారిపై చర్యలు తీసుకోండి, అంతే తప్ప ఇలా ఒట్టి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హితవు పలికారు.

రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తే గానీ గండికోటకు నీళ్లు తేవడం సాధ్యం కాదని, కానీ ముఖ్యమంత్రి జూలైలో 30 టీఎంసీల నీరు ఇస్తానని జిల్లా వాసులకు వాగ్దానం చేశారన్నారు. వచ్చే నెలలో శ్రీశైలం నుంచి నీటిని బిందెలతో, ట్యాంకర్లలో తెస్తారా.. అని ఆయన ఎద్దేవా చేశారు.

చదవండి :  పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?

జిల్లా అధికార యంత్రాంగం ప్రజాస్వామ్యబద్దంగా వ్యహరించకుండా అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఖాజీపేట పంచాయతీలో పాల్గొన్న కార్యక్రమం పార్టీ కార్యక్రమమా, అధికారిక కార్యక్రమమా అధికారులు చెప్పాలని నిలదీశారు. అధికారిక కార్యక్రమమైతే గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరపడం ఆనవాయితీ అని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం పచ్చచొక్కాల వారితోనే కార్యక్రమం నిర్వహించడం దారుణమన్నారు.

చదవండి :  కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తమ చేతిలో ఓడిపోయి, ప్రజలు తిరస్కరించిన వారిని వేదికనెక్కించి మాట్లాడించడమేనా ప్రజాస్వామ్యం అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే ప్రజలు ఎదురు తిరుగుతారని, అప్పుడు ఏ అధికారి కూడా పని చేయలేడని హెచ్చరించారు.

కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ…చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఏమీ చేయకపోయినా చేసినట్లు చెప్పుకొంటున్నారని, ఇది కూడా ఒక రక మైన వ్యాధేనన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా రూపాయి ఖర్చు పెట్టకపోయినా కడప విమానాశ్రయ నిర్మాణం మా ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: