బుగ్గవంక

బుగ్గవంక

అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది.

500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఈ నీటి అందాలను చూడటానికి అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చేవారుట. ఎప్పుడూ వరదలతో, ఇసుక దిన్నెలతో కలువ పువ్వులతో అలరాడుతూ ఉండే ఈ నదిలోనే కడప పుర ప్రజలు స్నానాలు చేసి తాగేందుకు మంచి నీరు తెచ్చుకొనే వారంట. నదికి రెండు వైపుల పూల చెట్లు, పూలతోటలు, మామిడి తోటలు, పండ్ల తోటలు ఉండేవి. ఈనాటి ద్వారకా నగర మంతా ఒకప్పటి మామిడి తోట. రవీంద్రనగర్, గుంత బజార్ , నాగరాజుపేట ప్రాంతాలలో మల్లె తోటలు ఉండేవి. సాయంకాలపు పూట పుర ప్రజలు నది గట్టుపై ఉన్న ఇసుక తిన్నెలపై, సేద తీరుతూ ఆటలు ఆడుతూ విహారించే వారు.

చదవండి :  జనవరి1న ఒంటిమిట్టలో పోతన భాగవత పద్యార్చన

కడప నగరం మున్సిపాలిటీగా మారిన తర్వాత, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేట, సున్నపురాళ్ళపల్లె, గుంతబజార్ ప్రాంతాలకు బుగ్గ నుంచి మంచి నీటిని గొట్టాల ద్వారా అందించే వారు. ఈ నీటి కోసమే తక్కిన ప్రాంతాల వారు కూడా పరుగులు తీసేవారు. ఈ నీరు రుచిగా ఉండటంతో పాటు, వారాల కొద్ది నిలువ ఉంచినా నీరు కలుషితం కాకపోవడం వలన అపురూపమైనదిగా భావించే వారు.

ఈ నది తీరంలో అక్కడక్కడ శివాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ నీటిని పంపు చేసే ప్రాంతంలో కూడా ఒక శివాలయం పూర్వమే నిర్మించారు. దానినే ప్రస్తుతం బుగ్గ శివాలయంగా పిలుస్తున్నారు. ఈ బుగ్గవంక నీటిని వ్యవసాయానికి అందించాలనే ధ్యేయంతో కడప నవాబుల కాలంలో దీనిపై ఒక చిన్న ఆనకట్ట కట్టి బబ్బెరావు వీధి దగ్గర నిల్వ ఉంచి, ఆ నీటిని గుర్రాల గడ్డ ద్వారా పాత కడప చెరువుకు మళ్లించడం జరిగింది.

చదవండి :  ఈరోజు కడపకు రానున్న ఇన్చార్జి మంత్రి

కె.సి.కెనాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ ఉండే బుగ్గ ఆనకట్టను తొలగించారు. పూర్వం ఈ బుగ్గవంకలో నీరు నడుము లోతుకు తక్కువ లేకుండా ప్రవహించేది.

పీర్ల పండుగ కడప నగరంలో ఒక అద్భుతమైన పండుగ. దక్షిణాదిలో ఎక్కువ మంది ఈ పండుగ రోజుల్లో పొల్లాన్ని, చివరి రోజు పీర్లతో, మేళతాళాలతో అనేక, విన్యాసాలతో మిరుమిట్లు గొలిపే వేషాలతో దిగి బుగ్గవంకలో స్నానం చేసి పీర్లను శుభ్రం చేసి తిరిగి స్పస్థలం చేర్చేవారు.

ఈ నది పరివాహక ప్రాంతంలోని తోటలకు, వ్యవసాయానికి , ఈ నీటిని కపిలల ద్వారా ఏతముల ద్వారా వాడుకొనే వారు. రవీంద్రనగర్‌కు వెళ్ళే పాత బస్టాండ్, గుంత బజార్, నాగరాజుపేటలలో చాలాభాగం పండ్ల తోటలు, పూలతోటలు ఉండేవి. గుంత బజారు నుండి మొదలై, వైవీ స్ట్రీట్, బెల్లం మండి, మోచంపేటలకు పెన్నా నుంచి తాగునీరు మున్సిపాలిటీ వారు అందించే వారు. నవాబుల పరిపాలనలో కూడా కోటలోనికి మంచి నీరు కోసం ఈ నదికి తాపలు నిర్మించి ఉండేవారు.

చదవండి :  అమెరికాలో సీమ వనభోజనాలకు 500 మంది

పాలకులు, ప్రజల నిర్లక్ష్యంతో తన పూర్వ అందచందాలను కోల్పాయిన బుగ్గవంక  ప్రస్తుతం ఒక మురికి కూపంగా మారింది. దీనిని అందంగా తీర్చిదిద్దుకుంటే కడపకు ఇది ప్రాణధారము అవుతుంది. ఈ బుగ్గవంకకు ఇరువైపుల రోడ్లు నిర్మిస్తే నగరంలో వాహనాల రద్దీ తగ్గి ప్రయా ణం సుఖమయంగా సాగుతుంది. మధ్య మధ్యలో ఫౌంటెన్‌లు ఏర్పాటు చేసి, వంకకు ఇరువైపుల లైట్లతో అలంకరిస్తే చూపరులకు ఎంతో ఆసక్తి దాయకమైన, ఆకర్షణీయమైన దృశ్యాలతో అలరాడుతుంది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

1 Comment

  • బుగ్గవంకను కడప నవాబుల పాలనా కాలంలో “నెహర్-ఎ-దావూదీ ” అని పిలిచేవారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: