కుందూ వరద కాలువకు నీరు-కెసి ఆయకట్టుకు మరణ శాసనం

కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే  కెసి ఆయకట్టు పాలిట మరణ శాసనంగా మారుతుందని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే కెసి రైతాంగానికి నీరు సరఫరా ఉండదని రైతులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రొద్దుటూరుకు తాగునీరు సరఫరా చేయాలని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ కోరారు.  జిల్లా కెసి కాలువ ఆయకట్టు స్థిరీకరణ కోసం కడప – కర్నూలు జిల్లాల సరిహద్దులో కుందూ నదిపై రాజోలి ఆనకట్ట వద్ద 2.95 టి ఎంసిల సామార్థ్యంతో 291 కోట్ల వ్యయంలో జలాశయాన్ని నిర్మించేందుకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని లేఖలో పేర్కొన్నారు. రాజోలి జలాశయాన్ని 2.95 టిఎంసిల సామర్థ్యంతో నిర్మిస్తే పికప్ ఆనకట్టతో పాటు కొంతభాగం వరదకాలువ మునిగి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. పరిస్థితులు తెలిసీ కందూ – పెన్నా వరద కాలువ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేసీ రైతాంగాన్ని వంచించడమేనని ఆహ్రం వ్యక్తం చేశారు. కేసీ ఆయకట్టు రైతు నేతలు, ప్రజాప్రతినిధులతో కలిపి సమీక్ష ఏర్పాటు చేయాలని డి.ఎన్.నారాయణ డిమాండ్ చేశారు. జిల్లాలోని సున్నపురాళ్లపల్లె వద్ద కందూ నది నుండి కాలువ ద్వారా నీటిని తీసుకెళ్లి ఉపరితలం లేదా భూతల జలాశయం ద్వారా మైలవరం నుండి కాలువ నుండి సిరిగేపల్లె చెరువుకు మళ్లించి తద్వారా పెన్నానదికి చేర్చడం ద్వారా ప్రొద్దుటూరుకు తాగునీరు ఇవ్వవచ్చన్నారు. లేదా రాజోలి జలాశయం నిర్మాణాంతరం కందూ – పెన్నా వరద కాలువ 11వ కి.మి. వద్ద స్లూయిస్ పెట్టి తాగునీరివ్వచ్చని అన్నారు. ఇన్ని ప్రత్యామ్నాయ మార్గాలుండగా కెసి ఆయకట్టుకు మరణశాసనంగా మారే కందూ-పెన్నా వరద కాలువకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు నంద్యాల వరదరాజుల రెడ్డి రాజోలి నిర్మాణానికి 10,15 సంవత్సరాల సమయం పడుతుందని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాజోలి జలాశయానికి టెండర్లు పిలిచి జిల్లాలోని 92 వేల కెసి ఆయకట్టు కింద రెండు పంటలు పండించుకునే వీలు కల్పించడంతో పాటు ఆయకట్టు చివర వరకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పైర్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెసి ఆయకట్టు రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు ఇవ్వాలని కోరారు.

చదవండి :  'తలుగు' పుస్తకావిష్కరణ అయింది

సంపాదకుడు

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: