
రేపు వైకాపా జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం
కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. నగరంలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఆకేపాటికే ఉందని చెప్పారు. కాగా ఆకేపాటి ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా, మండల కో-ఆప్షన్ సభ్యులు సహా అన్ని క్యాడర్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి అందరి సలహా, సూచనలు స్వీకరిస్తామని ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి …
రఘురామిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో అధికారపక్షం వైఎస్ రాజశేఖర్రెడ్డిని, వైఎస్ జగన్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు.
కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా… అని ఆయన ప్రశ్నించారు. రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయన్నారు. వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు.
సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై అధికార పక్షం అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు.
ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు.