సమాజం అంతగా పతనమైందా? – రారా

    సమాజం అంతగా పతనమైందా? – రారా

    (నవంబరు 24 రారా వర్ధంతి సందర్భంగా…)

    దిగంబర కవుల మూడవ సంపుటి మీద రారా సమీక్ష

    వీళ్ళు ఆరుమంది – అరిషడ్వర్గంలాగా. అందరికీ మారుపేర్లు వున్నాయి. తాము దిగంబర కవులమనీ, తాము రాసేది దిక్‌లు అనీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళ మొదటి సంపుటి 1965 మే లోనూ, రెండవ సంపుటి 66 డిసెంబర్‌లోనూ వచ్చినాయి. 68 సెప్టెంబర్లో మూడవ సంపుటి వచ్చింది. 120 పేజీలు గల యీ సంపుటిలో దిక్‌లు చాలానే వున్నాయి. కవిత్వం మాత్రం యెక్కడా లేదు.

    కవి ఒక అనుభూతిని మాటల ద్వారా వ్యక్తం చేస్తాడు; మాటల ద్వారా పాఠకులకు అందిస్తాడు. అప్పుడు ఆ మాటలను కవిత్వమంటాం. కవి సాధారణంగా తాను పొందిన అనుభూతినే తన కవిత్వంలో వ్యక్తం చేస్తాడు. కానీ అది కాదు మనకు ముఖ్యం. ఆ అనుభూతిని పాఠకులకు (లేక శ్రోతలకు) అందిస్తున్నాడా అనేదే నిర్ణాయకమైన ప్రశ్న. తాను యెంత గాఢమైన అనుభూతిని పొందినా అందులో కొంతైనా మనకు అందకపోతే అతని మాటలు కవిత్వం కాలేవు. అతన్ని కవి అనవలసిన అవసరం లేదు.

    తాము తీవ్రమైన ఆవేశం పొందినామని వీళ్ళు అంటున్నారు. నిజమే కావచ్చు. కుళ్ళిపోయిన యీ సమాజం మీదా, యీ కుళ్ళుకు కారణమైన రాజకీయ నాయకులమీదా, స్వాములవార్ల మీదా, సినిమాలమీదా, సినిమా తారలమీదా (ప్రొడ్యూసర్ల మీద కాదు). పెట్టుబడిదార్ల మీదా యింకా యెవరెవరి మీదనో వీళ్ళ కోపం కనపడుతూనే వుంది. వీళ్ళ కోపం నిప్పులు కక్కుతున్నట్లు కూడా మనకు అర్థమౌ తుంది. కానీ, వీళ్ళకు నిజంగా కోపం వుందని మనకు తెలిసినంత మాత్రాన అది కవిత్వంకాదు. ఆ కోపంలో కొంతైనా మనకూ కలిగితే – యీ కుళ్ళు సమాజం మీదా, యీ కుళ్ళుకు కారకులైన వాళ్ళ మీదా – అప్పుడు, అప్పుడు మాత్రమే, అది కవిత్వమౌతుంది. అది లేదుగనుకనే వీళ్లు రాసింది కవిత్వం కాలేక పోతున్నది.

    చదవండి :  సంవేదన (త్రైమాసిక పత్రిక) - జనవరి 1969

    పైగా, మనకు రోత కలుగుతుంది. వీళ్ళ రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒల్లెరగని కుసంస్కారమూ, ఆ నోటితీటా, ఆ మాటల కంపూ మనకు జుగుప్స కలిగిస్తాయి.

    మరీ జుగుప్స కలిగేది వీళ్లు అక్కడక్కడా కొన్ని బూతులు రాసినందుకు కాదు; కవిత్వపు వాసన యెక్కడా లేకుండా కవులమని చెప్పుకుంటూ మోసం చేస్తున్నందుకు; సమాజాన్ని ఉధ్ధరిస్తామని విర్రవీగుతున్నందుకు, యీ దురహంకారానికి తోడు బూతుల దుర్గంధం.

    నా అనుమానమేమంటే, తమకు కవిత్వం రాయడం రాదని వీళ్ళకు తెలుసు. కవిత్వంతో యెవరి దృష్టినీ ఆకర్షించలేమని వీళ్ళకు తెలుసు. కనుకనే పదిమంది దృష్టిని ఆకర్షించడానికి వెకిలి వేషాలూ, వికృత చేష్టలూ మొదలు పెట్టినారు. లేకపోతే – చెరబండరాజు, జ్వాలాముఖి వగైరా వింత వింత పేర్లు పెట్టుకోవలసిన అవసరమేముంది? తమ రాతలకు దిక్‌లు అని కొత్తవింతపేరు పెట్టుకోవలసిన అవవసరమేముంది? తమ సంపుటాలను రిక్షావాలాలతోనూ, హోటల్‌ క్లీనర్లతోనూ, భిక్షగత్తెలతోనూ ఆవిష్కరించవలసిన అవసరమేముంది? ఆ ఆవిష్కరణలు అర్ధరాత్రి పండ్రెండు గంటల వేళనే చేయించవలసిన అవసరమేముంది? వీళ్ళ మొదటి సంచికను ఒక రిక్షావాలా అవిష్కరించినప్పుడు “మంత్రిని పిలవడం స్పాబరీ, లేక స్లేవరీ. రిక్షావాణ్ణి పిలవడం ఒక పోజు, లేకపోతే ఓ రకమైన అత్మవంచన” అని తిలక్‌ అన్నాడట, వీల్లకే ఉత్తరం రాస్తూ. వీళ్లది ఆత్మవంచనగా కనపడదు. కనుక పోజే కావాలి.

    చదవండి :  భారద్వాజస గోత్రీకుడు షేక్ బేపారి రహంతుల్లా!

    రాజకీయ వర్గాలలో వీళ్ళ పోజు కొన్ని భ్రమలు కల్పించినట్లుంది. సమాజపు కుళ్లకు కారకులైన వాళ్లను వీళ్లు బూతులు తిడుతున్నారు గనుక, వీళ్ల రచనలు సమాజ క్షేమానికి వినియోగ పడతాయని వాళ్లు ఆశపడుతున్నట్లుంది. రాజకీయ విలువ యెంత వున్నా ఒక రచన కవిత్వం కాజాలదనే విషయం అటుంచి, రాజకీయ చిత్తశుద్ధి కూడా వీళ్ళ రచనల్లో కనిపించదు. వీళ్ళ ఉద్యమం సమాజపు మురికి గుంటను తొలగించడం కాదు; ఆ మురికి గుంటను కెలికి ఆ కంపును దశదిశలకూ వ్యాపింప జేయడమే.

    కాదంటే మరొక విధంగా చెప్పవచ్చు. వీళ్లు మురికి గుంటను పూడ్చి శుభ్రంచేసే ఆరోగ్యశాఖవాళ్ళు కాదు; మురికి గుంటలోనే ఉద్భవించి, అందులోనే తిని, తాగి, తందనాలాడి, ఆనంద పారవశ్యం చెందే క్రిమి సంతానం.

    అనగా సమాజం కుళ్ళుకు వీళ్ళు ఒక చిహ్నం. సమాజం కుళ్ళులో వీళ్ళు ఒక భాగం, సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళు ఒక నిదర్శనం. సమాజం కుళ్ళిపోవడానికి వీళ్ళూ ఒక కారణం.

    చదవండి :  కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం - నటి టి.జి.కమలాదేవి

    సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే. సమాజం పతనమైన మాట నిజమే. విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్కరించడానికి సాధ్యంకానంతగా పతనమైన మాట నిజము. కానీ, యెంత పతనమైనా, యీ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకునేటంతగా పతనమైందా?

    (సంవేదన, జనవరి 1969)

    – రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా)

    రాచమల్లు రామచంద్రారెడ్డి గురించి :

    రాచమల్లు రామచంద్రారెడ్డి1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రాచమల్లు రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీలోకానికి  రారాగా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రారాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్య్రం – సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రారా 1988 నవంబరు 25న తుది శ్వాస వదిలారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *