
విద్యుత్ చార్జీల పెంపు సమంజసమా!
ప్రొద్దుటూరు: లోటును అధిగమించేందుకు విద్యుత్ చార్జీలు, పన్నుల పెంపు సమంజసమే అని మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి సమర్ధించారు. బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… స్పీకర్ పట్ల వైకాపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేశారని ఆరోపించారు. వైకాపా తన వైఖరిని మార్చుకోవాలని వరద సూచించారు. ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న విషయం జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. వైకాపాలో గూండాగిరి చేసే వారు అధికంగా ఉన్నారని ఆరోపించిన వరద చట్ట సభలను గౌరవించే సంప్రదాయాన్ని ప్రతిపక్షం నేర్చుకోవాలని హితవుపలికారు. వైకాపా ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఎలాంటి భారం పడదని తెలిపారు. లోటును అధిగమించేందుకు పన్ను పెంపు తప్పనిసరి అని వివరించారు. పరిపాలనలో తప్పు చేసే వారికి దండన తప్పదని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే అధికారులు ఎంతటివారైనా వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
ఇన్నాళ్ళూ స్తబ్దుగా ఉన్న వరదరాజులరెడ్డి గారు మొత్తానికి విద్యుత్ చార్జీల పెంపును సమర్ధిస్తూ, ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ వెలుగులోకి వచ్చారనమాట. ఇంతకీ వరదరాజులరెడ్డి గారు చెప్పినట్లు విద్యుత్ చార్జీల పెంపు సమంజసమేనా?