
ఒంటిమిట్ట రథోత్సవం
కనుల పండువగా కోదండరాముని రథోత్సవం
ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ మిన్నంటుతుండగా రథ చక్రాలు ముందుకు కదిలాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
తూర్పు ద్వారం నుంచి మొదలైన రథోత్సవం మెయిన్ బజారు వద్దకు చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి ఇచ్చారు. తిరిగి సాయంత్రం మొదలైన రథోత్సవం భక్తుల జయ జయధ్వానాల మధ్య రథశాలకు చేరుకుంది. ప్రత్యేక పూజల అనంతరం సీతా లక్ష్మణ సమేత రాముల వారి ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకెళ్లారు.
వైకాపా అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు.