
బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం
బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు…
చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి
డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ
రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా
పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి
దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ||
మోపిడీ ముకష్టూరులోన రాయి రాయి గరిగే యాళ
అగిడీవాళ్ల యిల్లుదూరి జీటినెంలరు జేసినాడు ||రామ||
బళ్ళారి కచ్చేరికైన పట్టపగలె అగ్గిబెట్టి
బళ్ళారి ఖజాన దోసి బీదబిక్కి కెగజల్లె ||రామ||
బందిమింద రెడ్డి రాంగ పదిమంది చుట్టుముట్రి
చిన్నలూరి మాదిగోడు పండబెట్టి గొంతుగోసె ||రామ||
కొడుకు కొడుకంటాని గోడుగోడునె గౌరమ్మ
బొబ్బిళ్ళ వంశమంత బుడు మారిపోయినాది
రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా
జీటినెంలరు = దివీటీల వెలుగులో
పాడినవారు: మాదిగ గంగన్న, మోపిడి, గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా