
పి రామకృష్ణ
ఆధునిక సాహిత్యకారులకు చిరపరిచితమైన పేరు రామకృష్ణారెడ్డి పోసా. నిశితంగా రచన చేయడంలో నేర్పరి. వీరి మొదటి కథ ‘వెనుకబడిన ప్రయాణికుడు’ 1965 జులైలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. కడప మాండలికంలో వీరు రాసిన ‘పెన్నేటి కథలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి.
విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’ గేయకావ్యం తర్వాత అంతే పదునుగా, స్పష్టంగా రాయలసీమ జనజీవన చిత్రాన్ని రూపుకట్టి చూపించిన కథలు రామకృష్ణారెడ్డి గారి ‘పెన్నేటి కతలు’. పెన్నేటి ఒడ్డున ఒక గ్రామంలోని జీవన శకలాలను ఒక్కో కథగా మలిచి ధారావాహికగా వెలువరించిన ఈ ‘పెన్నేటి కతలు’ రాయలసీమ బతుకులను శకలాలు శకలాలుగా చూపిస్తాయి.
రెడ్డి గారు రాసిన ఇతర కథలు ‘మనిషి – పశువు’ సంకలనంగా వచ్చాయి. ఆ తర్వాత మరిన్ని కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి విమర్శనా వ్యాసాలూ కూడా మార్క్సిస్టు దృక్పధంతో చేవదీరి ఆలోచింపచేసేవిగా ఉంటాయి. వీరు మూడు నవలలు కూడా రాశారు. వీరి రచనలు అన్నీ కలిపి ‘పి రామకృష్ణ రచనలు’ పేర ఒకే పుస్తకంగా వెలువడినాయి.
కడప జిల్లాలోని హనుమనగుత్తి వీరి స్వస్థలం. సుదీర్ఘకాలం పాత్రికేయునిగా పని చేసి పదవీ విరమణ పొందిన వీరు ప్రస్తుతం విజయవాడలో నివశిస్తున్నారు. చిరునామా: 404, జె.బి.ఎస్.రెసిడెన్సి, సాలిపేట రోడ్, పోరంకి, విజయవాడ – 521137
పూర్తి పేరు : రామకృష్ణారెడ్డి పోసా
పుట్టిన సంవత్సరం : 1938
వృత్తి : పాత్రికేయులు
స్వస్థలం : హనుమనగుత్తి, కడప జిల్లా
నివాస స్థలం: విజయవాడ
మొదటి కథ : ‘వెనుకబడిన ప్రయాణికుడు’ (1965 జులై, జ్యోతి మాసపత్రిక)
పుస్తకాలు : పెన్నేటి కతలు (1989), మనిషీ – పశువు (1997) (కథల సంకలనాలు), పి రామకృష్ణ రచనలు (2015) (సాహితీ సర్వస్వం)
తల్లిదండ్రులు : కీ.శే. పోసా వెంకట కొండారెడ్డి, కీ.శే పోలా లక్ష్మమ్మ
సహధర్మచారిణి : శ్రీమతి చిన్నమ్మ
పిల్లలు : ఒక కుమార్తె (సుమిత్ర), ముగ్గురు కుమారులు (సురేంద్రనాద్ రెడ్డి, తులసీకృష్ణ, మురళీధర్ రెడ్డి)