
గడికోట శ్రీకాంత్ రెడ్డి – రాయచోటి
కడప జిల్లా తెదేపా నేతలు నోరు మొదపరేం?
కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు.
కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా సంక్షేమ పథకాలకు ఆధార్ వంటి పలు రకాల లింకులు పెడుతున్నారని, దీని వల్ల అర్హులైన వారు కూడా నష్టపోయే అకాశం ఉందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.