
అనంతపురం గంగమ్మ దేవళం
గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు
లక్కిరెడ్డిపల్లె: రాయలసీమలోనే ప్రసిద్ది గాంచిన లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగినాయి. జాతరకు భక్తజనం పోటెత్తారు. గురువారం తెల్లవారుజామున చాగలగుట్టపల్లి నుంచి అమ్మవారి చెల్లెలైన కుర్నూతల గంగమ్మ భారీ వూరేగింపు నడుమ అనంతపురంలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు.
దారి పొడవునా వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం సమీపంలోకి చాగలగుట్టపల్లె అమ్మవారు చేరుకోగానే అనంతపురం గంగమ్మ ఆలయ అర్చకులైన చెల్లు వంశీయులు అమ్మవారికి కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ఆలయంలోకి ప్రవేశింపచేశారు. అనంతరం దేవాలయం ముందు అనేక మంది మహిళలు సిద్దుల పూజను నిర్వహించి సంతానం కోసం వరపడ్డారు. వీరికి సిద్దుల ప్రసాదాన్ని పంచి పెట్టారు.
బోనాల సమర్పణ
గంగమ్మకు మొక్కుబడులు సమర్పించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయం ఎదుట వేలాదిగా మేకపోతులను, పొట్టేళ్ళను, దున్నపోతులను, కోళ్లను బలిఇచ్చారు.
సిరిమాను ఉత్సవం…
సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కోర్కెలు తీరిన భక్తులు గురువారం రాత్రి చాందినీ, కుంకుమ బండ్లు, టెంకాయ బండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాతర జన సంద్రంగా మారింది.

సాంస్కృతిక కార్యక్రమాలు
జాతరలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చెక్క భజనలు, జానపద గీతాలాపనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
పులివెందుల ఏఎస్పీ కెకెఎన్ అంబురాజన్ జాతర ప్రాంగణాన్ని సందర్శించి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఆర్టీసీవారు రాయచోటి, పులివెందుల, కడప, కదిరి, మైదుకూరు, రాజంపేట తదితర డిపోల నుండీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయివేటు వాహన దారులు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
పట్టు వస్త్రాలు
గంగమ్మ తల్లికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.