కడప జిల్లా వాసుల దురదృష్టం

ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్‌  రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్  ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.

35 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జిల్లాలో వర్షాలు లేవన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా కంటే ఈ ఏడాది కడప జిల్లాలో వర్షాలు తక్కువగా పడ్డాయన్నారు. ఏ పంట వేసుకోవాలో తెలియని పరిస్థితిలో రైతులు అల్లాడుతున్నారని వివరించారు. రాబోయే కాలంలో తాగునీటి ఎద్దడి తీవ్రతరమవుతుందని తెలిపారు.

చదవండి :  జిల్లాపైన ఆరోపణలు గుప్పించిన కలెక్టర్

ఏప్రిల్ నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నీటి ఎద్దడి నివారణకు విడుదల చేసిన ’2కోట్లు తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. ఈ నిధులతో మంచి నీటి కొరత ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలనాటికి భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్నారు.

జనవరి నుంచి మార్చి నెల వరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియడం లేదన్నారు. ముగ్గురం మంత్రులు సీఎంను కలిసి దీనంగా వేడుకున్నా నిధులు మంజూరు చేయకపోవడం కడప జిల్లా వాసుల దురదృష్టమో, తమ దురదృష్టమో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి :  ప్రొద్దుటూరులో కదం తొక్కిన విద్యార్థులు

ముఖ్యమంత్రికి తనకు అభిప్రాయ భేదాలు ఉంటే అది ప్రజలపై చూపిస్తే ఎలా అన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *