
ఒంటిమిట్ట కోదండ రామాలయం
తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట
మాట తప్పిన ప్రభుత్వం
తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం
కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు
ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు.
కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రామాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆగమన శాస్త్ర నియామాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే తితిదేలో విలీనమైన జిల్లాలోని ఆలయాల ఆలనా పాలనా, ఉత్సవాల నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు వినిస్తున్న నేపధ్యంలో ఒంటిమిట్ట భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.