
ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు
రాయచోటి : మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా విప్ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహులునాయక్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్ మహబూబ్బాష, 21వ వార్డు కౌన్సిలర్ షాహిరున్నీసాలపైన ఈ వేటు పడింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఛైర్మన్, వైస్ఛైర్మన్లుగా పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వేయలేదంటూ వైకాపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
అయితే తమకు పార్టీ విప్ అందలేదని, కాబట్టి తమకు విప్ ధిక్కరణ వర్తించదని, ఆముగ్గురు కౌన్సిలర్లుసమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ముగ్గురిపై అనర్హత వేటు వేస్తూ..కౌన్సిలర్గా వాళ్ల అధికారాలను నిలుపుదల చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.