పులివెందుల జేఎన్టీయు కళాశాలకు యూనివర్సిటీ అకడమిక్ అటానమి స్టేటస్ ప్రకటించిందని అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల రూపకల్పనపై పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. పాఠ్యాంశాల తయారీ కోసం వివిధ ప్రాంతాల ఐఐటీ, ఎన్ఐటీ కళాశాల నుంచి ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమైన ఏడేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించడం గర్వంగా ఉందని చెప్పారు. అటానమి స్టేటస్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఉంటుందని ఆయన వివరించారు.
భవిష్యత్తులో ఈ కళాశాల అత్యున్నత స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
కళాశాల ప్రిన్సిపల్ దేవకుమార్ మాట్లాడుతూ.. అటానమి స్టేటస్ గుర్తింపు రావడంతో విద్యార్థులకు ఉపాధి కల్పించే పాఠ్యాంశాలు చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధునిక కాలనుగుణంగా సిలబస్లో మార్పులు చేసే అవకాశం ఉందన్నారు.
సంవత్సరిక పరీక్షల ప్రశ్న పత్రాలను ఇక్కడే తయారుచేసుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం ఐఐటీ కళాశాల (చెన్నై) ప్రొఫెసర్ రామసుబ్బారెడ్డి, అనంతపురం జేఎన్టీయూ ప్రొఫెసర్ భానుమూర్తి కూడా మాట్లాడారు.