సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు

కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు.

సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు.

నిధులు కేటాయించాల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం నీటిని వృథా కానివ్వకుండా గాలేరు- నగరి పథకం పనులను త్వరగా పూర్తి చేయించాలని, శ్రీశైలం నీటిని గండికోట జలాశయానికి అందించాలని డిమాండు చేశారు. తాజా రాష్ట్ర బడ్జెట్టులోనైనా గాలేరు- నగరి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని, గండికోట, వామికొండ, సర్వరాయసాగర్ జలాశయాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

ప్రజలెలా నమ్ముతారు?

రాయలసీమ అభివృద్ధికి ఇంతవరకూ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. గతంలో రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని గతంలో దేవినేని ఆందోళన చేశారని గుర్తు చేశారు. జులై లోగా నీరు తరలిస్తామని, ఈ ప్రాంత రైతుల అవసరాలకు సాగునీరు అందిస్తామంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో గాలేరు-నగరి రద్దుచేయాలని కృష్ణ కమిటీ వేశారని అలాంటి చంద్రబాబు నేడు గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా వుందన్నారు.

చదవండి :  సీమ సమస్యలపై ప్రశ్నించినందుకు దాడి

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్టు ప్రతిపాదనల్లో పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడంపై చాలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 9ఏళ్ల తెదేపా పాలన కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టుల కోసం రూ. 17 కోట్లు కేటాయిస్తే.. దివంగత వైఎస్సార్ హయాంలో గాలేరు నగరి కోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో తాను, దివంగత వైఎస్సార్, ఎంవీ రమణారెడ్డి, సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాదయాత్రలు చేయగా.. ఆయా ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని.. అవసరమైన నిధులు ఇచ్చి, వాటిని పూర్తి చేయించాలన్నారు.

చదవండి :  రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

3 టీఎంసీల నీరు ఇచ్చిన కిరణ్

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గండికోటకు 3 టీఎంసీల నీరు ఇచ్చారని.. శ్రీశైలం వరద నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది.. ఆ మేరకు మాకు తాగునీరు ఇమ్మని అడిగితే పలకని మంత్రి.. ఇప్పుడు సీమకు నీళ్లిస్తామంటే ప్రజలెలా నమ్ముతారు? అన్నారు.

పట్టిసీమ ఎవరి కోసం?

గోదావరి జిల్లాల ప్రజలే వద్దంటుంటే.. పట్టిసీమ ప్రాజెక్టు ఎవరి కోసం? పరిశ్రమల అవసరాలకు, తాగునీటి అవసరాలకు 80 టీఎంసీల నీరు ఇస్తామని చెప్పడం కల్లబొల్లి కబుర్లేనని, ఈ విషయం ఏ జీవోలోనైనా ఉందా? ఎక్కడి నుంచి ఆ నీరు ఇస్తారు? సీఎం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నిధులివ్వాలని.. కానీ ప్రస్తుతం కేంద్రం స్థాయిలో దాని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి :  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

రాయలసీమ జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల యేటేటా భూగర్భజలాలు అడుగంటిపోయి, సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా… ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదులు వేశారేగానీ, వాటిని సకాలంలో పూర్తి చేస్తామనే ఆలోచన ఎవరిలో లేకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే దీక్షకు మిత్రపక్షాలు మద్దతు పలకడం సంతోషకరమైన విషయమన్నారు.

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డికి మద్దతుగా పెండ్లిమర్రి మండల వైకాపా కార్యకర్తలు నిరాహార దీక్షలో కూర్చొన్నారు. వైకాపా జిల్లా శాఖ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, సీపీఎం నేత నారాయణ, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, వైకాపా మండల సమన్వయకర్త రఘునాథరెడ్డి, వీరప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు

రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష సోమవారం రెండో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో వీరపునాయునిపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి అనిల్‌రవికుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *