
సిద్దేశ్వరం అలుగు వద్ద
భారీగా మోహరించి…చెక్ పోస్టులు పెట్టి … రోడ్లను తవ్వి…
ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన
నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం
అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం
సిద్దేశ్వరం వెళ్ళే దారిలో వందలాది తనిఖీ కేంద్రాలు
రైతునాయకుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం
ప్రతిఘటించిన రైతులు
(సిద్దేశ్వరం నుండి మా ప్రత్యేక ప్రతినిధి)
వాళ్ళు దారి పొడవునా తనిఖీల పేరుతో కాపు కాశారు. కొంతమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని మార్గమధ్యంలోనే నిలువరించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. నాలుగు జిల్లాల నుండి తరలివచ్చిన వాహన శ్రేణులను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. ఇవేవీ కుదరకపోవడంతో రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వారు. ఇవన్నీ చేసింది రైతులు కాదు… ఉద్యమకారులు అంతకన్నా కాదు. రాయలసీమకు చెందిన వాడిగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పాలనలో రాయలసీమకు చెందిన దళపతి సారధ్యంలో పనిచేస్తున్న పోలీసులు శాంతియుతంగా సాగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గెరిల్లా యుద్ధతంత్రాలను ప్రయోగించి ఔరా అనిపించారు.
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులను అదే పేరుతో ప్రభుత్వం బక్కచిక్కిన సీమ రైతులపైకి ఉసికొల్పింది. సిద్దేశ్వరం వెళ్ళే దారిలో అడగడుగునా ఆటంకాలు సృష్టించింది. అయినా సీమ రైతుబిడ్డలు ఎక్కడా సంయమనాన్ని కోల్పోకుండా గమ్యానికి చేరారు. సీమవాసుల స్వప్నమైన సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేశారు.
శాంతియుతంగా సాగిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకొని అలజడి సృష్టించేందుకు పోలీసులను భారీగా రంగంలోకి దింపిన ప్రభుత్వం రాయలసీమ ప్రజల పట్ల తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అడవిలో, ముంపు ప్రాంతంలో ఉన్న సిద్దేశ్వరం వద్దకు రైతులు వెళితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సన్నాయి నొక్కులు నొక్కి ఆ పేరుతో రాయలసీమ రైతులను భయపెట్టాలని చూసిన ప్రభుత్వ పన్నాగం పారలేదు. వేలాదిగా తరలివచ్చిన రాయలసీమ రైతుల గుండెబలం ముందర పోలీసు జులుం తలవంచక తప్పలేదు.
రాయలసీమలోని నాలుగు జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన రైతులు రైతునాయకులను పోలీసులు కర్నూలు జిల్లాలో పలుచోట్ల తనిఖీకేంద్రాలు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా రైతులు ఎక్కడికక్కడ నిరసన తెలియచేసి సిద్దేశ్వరం వైపు కదిలారు. బండి ఆత్మకూరు, వెలుగోడులలో వాహనాలను అడ్డుకుని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులకు బుద్ది చెప్పారు. వెలుగోడు ఎస్ఐని స్టేషన్లోకి పంపి గడియపెట్టి రైతులు సిద్దేశ్వరం వైపు కదిలారు. అలాగే సిద్దేశ్వరానికి ముందు వచ్చే కపిలేశ్వరం వద్ద రైతుల వాహనాలను అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు జేసిబి సాయంతో రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వి ఇబ్బందులు సృష్టించారు. అయితే రైతులు పోలీసులతో వాదించి ఈ కందకాలను పూడ్చి సిద్దేశ్వరం చేరుకున్నారు. మహానాడుకు వెళ్ళే వాహనాలకు వర్తించని నిబంధనలు రైతుల వాహనాలకు ఎలా వర్తిస్తాయో చెప్పాలని పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు సమాధానం చెప్పలేక పై అధికారుల ఆదేశాలు పాటిస్తున్నామని అర్థం చేసుకోవాలని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతులు పెద్ద పెట్టున ‘జై రాయలసీమ’ అంటూ నినాదాలు చేస్తూ సిద్దేశ్వరం వైపు వెళ్ళారు.
సిద్దేశ్వరానికి రహస్యంగా చేరుకునేందుకు ప్రయత్నించిన రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డిని ఎర్రమటం వద్ద ఎర్రమటం వద్ద ఆత్మకూరు డిఎస్పీ సుప్రజ అరెస్టు చేసే ప్రయత్నం చేసి వాహనంలోకి ఎక్కించారు. అక్కడకు చేరుకున్న రైతులు డిఎస్పీ వాహనాన్ని అడ్డుకుని దశరథరామిరెడ్డిని పోలీసు వాహనం నుండి కిందకు దించి సిద్దేశ్వరం వైపు తరలివెళ్ళారు.
సిద్దేశ్వరం చేరుకున్న రైతుసంఘాల నేతలు, రైతులు సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బోజ్జా ను ఒక్కడినే పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తీసుకెళ్ళారు.ఆత్మకూరు,నందికొట్కూరు ,ముచ్చుమర్రి పోలీసు స్టేషను లలో మార్చి మార్చి రహస్యంగా అయనను తరలించారు.
తరువాత అక్కడి సంగమేశ్వర ఆలయం ముందు సమీపంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభలో పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ అలుగు నిర్మాణం విషయంలో రాయలసీమ రైతులు ప్రదర్శించిన స్పూర్తిని కొనియాడారు. ప్రభుత్వం పోలీసుల సాయంతో కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేసినా రైతులు వారికి మద్ధతుగా మేధావులు, విద్యాధికులు, ఉద్యోగులు తరలిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలుగు నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బొజ్జా దశరథరామిరెడ్డిని విడుదల చేయాలని సాయంత్రానికి ముచ్చుమర్రి స్టేషనుకు చేరారు. రాత్రి 8 గంటలకు విడుదల చేయాగా బొజ్జా తో పాటు రైతులు ఇళ్ళకు చేరారు.
అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో రైతుసంఘాలే కాకుండా విరసం, రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం, రాయలసీమ మహాసభలకు చెందిన పలువురు హాజరయ్యారు.
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన ఫోటోలు:


























