
సిద్దేశ్వరం అలుగుపై రంగంలోకి దిగిన నిఘావర్గాలు
మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన?
కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే అంశంపై ఒక అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి.
రాయలసీమ జిల్లాల నుండి వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు చేపట్టాలని నిఘా వర్గాలు సూచించాయి. సీమ జిల్లాల ప్రజల్లో అలుగు నిర్మాణం పట్ల ఆసక్తి అధికంగా ఉందని, ఈ అలుగు కోసం సాధారణ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్న ఉద్యోగులు, విద్యాధికులు కూడా తరలి వస్తారని నివేదించారు. అలుగు శంకుస్థాపన విజయవంతమైతే అది రాయలసీమ ఉద్యమం మరింత బలపడేందుకు దోహదం చేస్తుందని నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అనూహ్యంగా తెలంగాణా వైపున ఉన్న మల్లేశ్వరం వైపు ప్రజల నుండి కూడా ఆ కార్యక్రమానికి మద్దతు లభించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
నిఘా వర్గాల నివేదిక నేపధ్యంలో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమం నుండి మీడియా దృష్టి మరల్చేందుకు ప్రయతిస్తున్నట్లు సమాచారం.
అదే రోజున రాయలసీమ సాగునీటి పథకాల పురోగతిని సమీక్షించడం వంటి కార్యక్రామాలు చేపట్టడం అవసరమైతే పార్టీ తరపున రాయలసీమ నాయకులతో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి సదరు వార్తలకు ప్రాధాన్యత దక్కేలా చెయ్యాలనే వ్యూహంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. అలాగే తెదేపాకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆ పార్టీ నుండి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా రాయలసీమ ప్రజలు స్వచ్చందంగా చేపడుతున్న అలుగు శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వానికి సెగలు పుట్టిస్తోంది.