దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం …

కడప : ‘ఏమీ చేయలేని అమాయకుల మీద కాదు ప్రతాపం చూపేది. దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డున తగుల్దాం.. ఎప్పుడైనా సరే. సవాల్‌ చేస్తున్నా..’ అంటూ కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఆగ్రహంతో మాజీ మేయరు రవీంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

సోమవారం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కిడ్నాప్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వీరశివ సహనం కోల్పోయారు. మాజీ మేయరుపై విరుచుకుపడ్డారు. ‘రవీంద్రనాథ్‌రెడ్డి’ పేరు ఉచ్చరించేందుకు ఇష్టం లేదన్నారు. నిర్దోషి అయితే లొంగి పోవాలి కదా.. తప్పించుకొని తిరగడమేంటన్నారు.

శనివారం రాత్రి కడపలో కమలాపురానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో తలదాచుకొని- ఉదయమే హెల్మెట్‌ పెట్టుకొని స్కూటర్ల మీద పారిపోయాడని ఎద్దేవ చేశారు. ‘ఆయన చేతిలో సాక్షి పత్రిక, ఛానల్‌ ఉన్నాయి. ఏమైనా రాయించుకోవచ్చు, హైదరాబాదులో కిడ్నాప్‌ చేసిన వారి వెనక కత్తులు పెట్టి.. తమను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని చెప్పించారు. తాము మానవ హక్కుల కమిషనరుకు ఫిర్యాదు చేస్తాం’ అని వెల్లడించారు.

చదవండి :  'సీమ ప్రజల గొంతు నొక్కినారు'

ఆది.. అధికార దాహం

శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డికి అధికార దాహం పట్టుకుందని వీరశివారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఎమ్మెల్యే.. అన్న ఎమ్మెల్సీ.. అన్న కొడుకు ఎమ్మెల్యే కావాలనే కోరిక పెంచుకున్నారని విమర్శించారు. జగన్‌ పోటీ చేయలేదని ప్రకటిస్తే.. ఆయన వర్గంలో ఉండీ పోటీ పెట్టటం విచిత్రంగా ఉందన్నారు. ఆదినారాయణరెడ్డి వందల కోట్లకు.. జగన్‌ లక్షల కోట్లకు అధిపతన్నారు.

వారు ఓట్లను కొంటారని- మేము కొనలేమని తేల్చిచెప్పారు. త్వరలో ఎంపీటీసీ సభ్యులతో భారీ ప్రదర్శన నిర్వహించి ఎవరి బలమేంటో తేలుస్తామని చెప్పారు. ఉప ఎన్నికల్లో కూడా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చదవండి :  చరిత్రలో రాయలసీమ - భూమన్

ఎవరు కిడ్నాప్‌ చేశారో తెలీదు..

మా కుటుంబ సభ్యులను ఎవరు కిడ్నాప్‌ చేశారో తెలియదని చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలక్షుమ్మ, ఇప్పపెంట-2 ఎంపీటీసీ సభ్యురాలు హిమాంబీ చెప్పారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నా భర్త వెంకట సుబ్బయ్యను ఎవరు కిడ్నాప్‌ చేసిందీ తెలీదని వెంకట లక్షుమ్మ అన్నారు. తన కొడుకు షరీఫ్‌ను కూడా ఎవరు కిడ్నాప్‌ చేసిందీ తెలీదని హిమాంబీ చెప్పారు.

కిడ్నాప్‌ ఎలా తెలిసిందన్న ప్రశ్నకు..

చదవండి :  'డబ్బులిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాల'

పత్రికలు చూసి తెలుసుకున్నామన్నారు. కిడ్నాప్‌ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉన్నామని, ఎవరూ తమను బలవంతంగా తీసుకు పోలేదన్నారు. కిడ్నాప్‌ అయినట్లు పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేసిందీ తెలియదన్నారు. దౌర్జన్యాలు చెల్లవు.. మేయరుగా పని చేసిన రోజుల్లో దౌర్జన్యం చేసినట్లు ఇప్పడు చెల్లవని ప్రజారాజ్యం అధ్యక్షుడు హరిప్రసాద్‌ అన్నారు.

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యుల కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూస్తావని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్‌, కాంగ్రెస్‌, పీఆర్పీ నాయకులు పాల్గొన్నారు.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *