తెదేపా వైపు వరద చూపు ?

తెదేపా వైపు వరద చూపు ?

ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన  వీటిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వరద చేయలేదు.

చదవండి :  వరదరాజులురెడ్డి అందుకే దేశంలోకి వచ్చారా!

2009లో వరదరాజులురెడ్డి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయగా, లింగారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. జిల్లా అంతటా కాంగ్రెస్ గాలి వీచినా ప్రొద్దుటూరులో మాత్రం వరదరాజులురెడ్డిపై లింగారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. నాడు వైరి వర్గంగా కత్తులు దూసుకుని ఆరోపణ, ప్రత్యారోపణలు మొన్నటి వరకు కొనసాగించారు. అయితే ఇటీవల ఈ విమర్శలు తగ్గాయనే చెప్పవచ్చు. ఈ పరిణామం వరదరాజులురెడ్డి టీడీపీలోకి జంప్ అవుతారన్న ఊహాగానాలకు ఊతమిస్తోంది. అయితే వరద టీడీపీలోకి వస్తే లింగారెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

లింగారెడ్డిని కడప ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పంపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ మనుగడ కష్టతరం అవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నూతన పార్టీ పెట్టే అవకాశం ఉందని, అప్పటి వరకు వేచి చూడాలన్న ధోరణిలో కూడా వరద ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.

ఈనెల 19, 23 తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెత నిజం చేస్తారా లేక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని నిజం చేస్తారో వేచి చూడాల్సిందే.

చదవండి :  తెదేపా గూటికి చేరిన వరద

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *