
నందలూరు సౌమ్యనాథ ఆలయం
భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలకు నిలయంగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి కట్టడాలలో కడప జిల్లాలోని నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం ఒకటి.
శ్రీ సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్పకళా సంపదకు అలవాలమై బాహుదానదీ తీరాన అహ్లదకరమైన ప్రశాంత వాతావరణంలో తూర్పుముఖంగా వెలిసివుంది. కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో ఈ ఆలయం వెలసివుంది.
ఈ నందలూరును పూర్వపుకాలంలో నీరందనూరు, నిరంతరపురం, నెలందలూరు అనే నామాంతరాలుండేయి. నందలూరు పక్కనే ప్రవహించే నది బాహుదానది – దీనినే చెయ్యేరు, భృగునదియని ఈ ప్రాంతీయులు పిలిచేవారు.
శ్రీ సౌమ్యనాధుని ఆలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్థంభాలతో వైకాసన వైష్ణవాగమ హర్షపోక్త వాస్తుయుక్తంగా నిర్మించబడిన సువిశాలమైన ఆలయం.
చరిత్ర
కుళుతుంగ చోళుడు 11వ శతాబ్దం పూర్వార్థంలో ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ సౌమ్యనాథస్వామి వారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాలు తెలుపుతున్నాయి. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పటి నుండి చోళ, పాండ్య, కాకతీయ, మట్టి, విజయనగరం మున్నగు రాజ వంశీయులచే 17వ శతాబ్దం వరకు దశల వారీగా నిర్మాణాలు జరుగుతూ పలు రాజుల అలన పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీ సౌమ్యనాథస్వామి వారికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, ప్రాకారాలు, మహద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి.
ప్రత్యేకత
బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహాప్రియుడు నారదుడు ఈ ఆలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్ను ప్రతిష్టించారని ప్రతీతి.
చొక్కనాథుడు
శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్యని, కులోతుంగ చోళఎంబరు మన్నార్ విన్నగర్ అని అనేక నామాలతో భక్తులు పిలుస్తుంటారు. సౌమ్యనాథుడన్నా, చొక్కనాథుడని సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు (శ్రీలక్ష్మి) నాథుడని అర్థం. శ్రీ సౌమ్యనాథునిపై అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనలలో చొక్కనాథుడుగా కీర్తించాడు.
శ్రీ సౌమ్యనాథాలయం కడపజిల్లాకే కీర్తికిరీటంగా బాసిల్లుతుంది. ప్రశాంత వాతావరణంలో రమణీయమైన ప్రకృతి నడుమ, క్షీరాబ్దినాథుడైన శ్రీ సౌమ్యనాథుడు ప్రశాంతమూర్తిగా ఇక్కడ కొలువైవున్నాడు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కీర్తింపబడుతున్నాడు.
గాలి గోపురం (సింహద్వారం)
శ్రీ సౌమ్యనాథుస్వామి ఆలయం వెలుపల ఆకారం తూర్పున ఉన్న పెద్దగోపురం ఈ ప్రాంతంలో ఆకర్షిణీయమైన కట్టడంగా గుర్తింపుపొందింది. ఈ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మహద్వార గోపురమని, ముఖ ద్వారమంటుంటారు. ఈ ద్వారంపై ఎతైన గోపురం నిర్మించడానికి అనువుగా బలీయమైన రాతిదూలాలతో ద్వారానికి ఇరువైపుల చౌకట్టు నిర్మింపబడింది. మహద్వార గోడలు మకరతోరణాలతో చోళ సాంప్రదాయ స్థంభంలతో అలరారుచుంది. ఈ గోపుర ద్వారంలో 12వ శతాబ్దంలో వేయించిన శాసనంలో ఈ గాలి గోపురం విమలాదిత్యుని కుమారుడు 3వ సోమేశ్వరరాజు నిర్మించినట్లు తేటతెల్లమవుతుంది.
ఉత్తర గోపురం
ఉత్తర గోపురం మహప్రాకారానికి అనుసంధానింపబడి ఉత్తర దిక్కున ఉన్న గోపురం. ఈ గోపురం ద్వారం లో ద్వారబంధంపై లతలు, కింద ఓ స్త్రీమూర్తి నిలిచి లతను పట్టుకున్నట్లు ఉంది. లతలు, ముఖవైఖరులు విజయనగర కాలాన్ని తలపింపచేస్తుంది.
దక్షిణ గోపుర ద్వారం
ఈ గోపురద్వారం కూడా మహప్రాకారానికి అనుసంధానింప బడిన గోపురమే. ప్రస్తుతం దక్షణం వైపు గోపురం లేదు. దాదాపు వంద సంవత్సరాలకు ముందు పెద్ద గాలివాన వచ్చిందని అపుడు దేవాలయ ఆవరణలోని పెద్ద చింతచెట్టు విరిగి ఆ గోపురంపై పడగా, గోపురం మధ్యకు చీలి పోయిందని పూర్వీకులు పేర్కొనేవారు. అప్పట్లో విరిగిన చెట్టును తొలగించారు. తర్వాత గోపురం మాత్రం కాలగమనంలో పూర్తిగా లేకుండా పోయింది. మిగిలిన ద్వారం కూడా నేడు శిథిలావస్థకు చేరుకోగా కేంద్ర పురావస్తు శాఖ వారు పై భాగాన్ని తీసివేసి మళ్లీ అమర్చి మరమత్తులు చేపట్టారు.
దీప స్తంభం
శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలోకి మహాగోపుర ద్వారం గుండా ప్రవేశించగానే మనకు ముందుగా కనిపిచ్చేది 8 అడుగుల ఎత్తుగల రాతి దీపస్థంభం. పునాది వద్ద నాలుగు సింహముఖాలు మోస్తుండగా ఈ రాతిస్థంభం నిట్టనిలువుగా అమర్చబడి ఉంది. బహుశా ఆ రోజుల్లో ఉత్సవ, పండుగ, ఊరేగింపుల సమయాల్లో వెలుతురు కోసం పెద్ద ప్రమిదలు వెలగించేందుకు ఈ రాతిస్థంభం ఉంచినట్టుగా చెపుతారు.
బలిపీఠం
పెద్దరాతిదీప స్థంభానికి దగ్గరలో పడమటి వైపు ఉన్నదే బలిపీఠం. కరుణాసాగరుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి నైవేధ్యం, పరివార దేవతలకు బలిని సమర్పించిన తరువాత ఈ ఎతైన బలిపీఠంపై బలి అన్నాన్ని సమర్పిస్తారు. ఈ బలిపీఠంపై ఉంచిన ఆహారాన్ని రాత్రింబవళ్ళు సంచరించే గణాలు స్వీకరిస్తాయని ప్రతీక.
ధ్వజ స్తంభం
బలిపీఠం ప్రక్కనే పడమర వైపున ఎత్తైన పీఠంపై ప్రతిష్టించిబడి ఉన్న ఎత్తైన స్తంభమే ధ్వజస్థంభం. ఈ స్థంభానికి కింది నుండి పై వరకు ఇత్తడి రేకు కప్పబడి ఉంది. నవనీతచోరుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల తొలిరోజున ఈ స్తంభంపై ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం జరిగిన నాటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
గరుడ మందిరం
ధ్వజస్తంభానికి ప్రక్కనే పడమటి వైపున లోపలి ప్రాకార ద్వారానికి ఎదురుగా అనగా సర్వ జగద్రక్షకుడైన శ్రీ సౌమ్యనాథస్వామికి ఎదురుగా గర్భగృహం లాంటి ఒక చతురస్రాకార చిన్న గుడిలో మనోహరమైన 4.5 అడుగుల గరుత్మంతుడు రెండుచేతులు జోడించి అంజలి ఘటిస్తున్నట్టు విగ్రహం ప్రతిష్టించబడి ఉంది.
శ్రీ ఆంజనేయస్వామి మండపం
గరుడాళ్వారుకు దక్షిణం వైపున ఓ మండపం గలదు. ఈ మండపంలో శ్రీ వీరాంజనేయస్వామివారిని ప్రతిష్టించి ఉన్నారు. ఈ మండపం 12 స్థంభాలు కలిగి ఉత్తరం తప్ప మిగతా దిక్కుల్లో గోడ నిర్మించబడి ఉంది.
చిన్నకోనేరు
సర్వపాప హరుడైన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ ఆవరణంలో గరుడ మందిరానికి ఉత్తరం వైపున చిన్న కోనేరు కలదు. ఈ కోనేరులో బ్రహ్మోత్సవాల చివరిరోజున ధ్వజారోహణ సమయంలో శ్రీ సౌమ్యనాథస్వామివారికి శ్రీదేవి భూదేవిలకు పంచామృతాభిషేకం గావించి చక్రతాళ్వారుతో సహా కోనేటి యందు అర్చక స్వాములు మునకలు చేస్తారు.
ప్రవేశద్వార గోపురం
భక్తుల పాలిటి పెన్నిధి అయిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ ప్రకారం ద్వారానికి ఇరువైపులా పెద్ద అడుగులు నిర్మించి ఉన్నారు. ఇది కేంద్ర పురావస్తుశాఖ తొలగించారు. ద్వారబంధనానికి పూర్తిగా ద్వారం మూయబడే విధంగా రె
సౌమ్యనాథ ఆలయంకు ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గంలో …
కడప–రేణిగుంట (తిరుపతి) రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. కడప, రాజంపేట, రైల్వేకోడూరు, తిరుపతిల నుండి ప్రతి 20 నిముషాలకు నందలూరు వెళ్లే బస్సు సర్వీసులున్నాయి.
దగ్గరి బస్ స్టేషన్ : కడప (45 KM), రాజంపేట (20 కి.మీ)
రైలు మార్గంలో …
నందలూరు ‘చెన్నై – ముంబై’ రైలు మార్గంలో ఉంది.
దగ్గరి రైలు స్టేషన్ : నందలూరు (2 KM) , రాజంపేట (20 KM) , కడప (40 KM) , రైల్వేకోడూరు (50 KM)
వాయు మార్గంలో …
దగ్గరి విమానాశ్రయం : కడప (45 కి.మీ), రేణిగుంట (95 KM) , చెన్నై (230 KM) , బెంగుళూరు (260 KM) , హైదరాబాదు (444 KM)
సౌమ్యనాథ ఆలయానికి దగ్గరలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలు :
- ఆడపూరు బౌధ్ధారామాలు (3 కి.మీ)
- ఒంటిమిట్ట కోదండరామాలయం (19.2 కి.మీ)
- అన్నమయ్య (చెయ్యేరు) జలాశయం (19 కి.మీ)
- అత్తిరాల పరశురామాలయం (27 కి.మీ)
- తాళ్ళపాక (అన్నమయ్య జన్మస్థలి) (10 కి.మీ)
- కడప నగరం (40 కి.మీ)
- కడప శిల్పారామం (40 కి.మీ)
- అమీన్ పీర్ దర్గా (40 కి.మీ)
- దేవుని కడప (42 కి.మీ)
- మామిళ్లపల్లి నగరవనం (42 కి.మీ)
- రామకృష్ణ మఠం (40 కి.మీ)
- సిధ్ధవటం కోట (34 KM)