పీనాసి మారాబత్తుడు

    పీనాసి మారాబత్తుడు

    తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ కాలిన్ మెకంజి.1810-15 మధ్య మద్రాస్ surveyor general గా 1816-21 వరకు భారతదేశ మొదటి surveyor generalగా పనిచేసిన ఈయన గ్రామ చరిత్రలను సేకరించాడు.వీటినే కైఫియత్లు,దండెకవిలె లు అంటారు.వీటిలో కడప కైఫియత్లను 5 భాగాలు గా కడప c.p.brown memorial trust వారు ప్రచురించారు. వీటిలో ఒక గ్రామం లోని గుడికి సంబందించిన ఆసక్తికరమైన కథను విద్వాన్ కట్టా నరసింహులు గారు “శ్రీశైలప్రభ” లో రాయగా ఆ గ్రామానికి నేను వెళ్ళాను.ఆ కథ మీరూ తెలుసుకోండి..

    కడప జిల్లా రాజంపేట సమీపానున్న ఆ గ్రామం పేరు టంగుటూరు. ఆ గ్రామ నివాసి “మారాబత్తుడు”. మనోడు ఎంతగొప్పోడంటే “ఆహ నా పెళ్ళంట” సినిమాలోని “కోటా”కు ముత్తాత. మనోడి గొప్పతనం కైలాసం వరకూ వ్యాపించింది. ఆ కైలాసనాధుడేమో అసలే “ఆదిభిక్షువు”.ఎలాగైనా మారాబత్తునితో దానం పొందుతానని ప్రతిన పూని యాచక బ్రాహ్మణుడిగా ఆ గ్రామం చేరుతాడు. “లేదు” తప్ప మరోమాటరాని మారాబత్తుడు కొన్ని యేళ్ళపాటు యాచకున్ని ఇంటిచుట్టూ తిప్పుకుని చివరికి ఎలాగైనా పీడ వదిలించుకోవాలని “కాశీ” వళ్తాడు. తన నివాసమైన కాశీలో మళ్ళీ శివుడు యాచకుడిలా వెంటపడి నీకు గంగా స్నాన ఫలం రావాలంటే ఏదైనా దానం ఇవ్వాలంటాడు. మనోడేమో గంగలో మునక వెయ్యకుండానే తిరిగి పోతుంటాడు.

    చదవండి :  వాన జాడ లేదు - సేద్యానికి దిక్కు లేదు

    చివరికి ఒక రోజు మనసు మార్చుకుని రెండు గుప్పిళ్ళు “ఆరికెలు”(మెట్ట ప్రాంతాల్లో పండే తృణ ధాన్యాల్లో పండే వీటి విలువ చాలా తక్కువ) దానమిస్తాను, అదీ మా ఊరిలోనే అని షరతు విధించి స్నానం చేసి ఊరు చేరుతాదు.

    మరునాడే యాచకుడు ప్రత్యక్షం.అనారోగ్యంగా ఉన్నందున బయటకు వచ్చి దానమివ్వలేనని శివున్ని వెనక్కు పంపుతాడు. ఈ తంతు కొన్ని నెలల పాటు సాగుతుంది.

    తను చస్తే తప్ప యాచకుడి పీడ విరగడ కాదని భావించి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. తన కొడుకును పిలిచి తాను మరణించినట్లు గ్రామస్తులకు చెప్పమంటాడు. తాను శవంలా పడుకుంటే స్మశానానికి తీసుకుపోయి చితి మీద ఉంచి నిప్పు పెట్టి వెంటనే ఆర్పివేయమంటాడు. ఈ పిసినారి వెంట ఎవరూ రాకపోయినా శవయాత్రతో రుద్రభూమి చేరుతాడు రుద్రుడు. చితికి నిప్పు పెట్టబోతాడు మారాబత్తుని కొడుకు.

    చదవండి :  "కడప దేవుని గడప" అని ఎందుకంటారో ...

    కాటికి చేరినా కాసింతైనా దానం చేయకూడదనే మారాబత్తుని మనోనిశ్చయానికి మెచ్చిన శివుడు శవదహనాన్ని ఆపమని చెప్పి,మారబత్తున్ని లేపి తనకు దానం అవసరం లేదంటాడు.

    ఇంత పట్టుదలతో గ్రామంలో,కాశీలో,తిరిగి గ్రామంలో ఏళ్ళ తరబడి యాచించిన నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వెవరవు అని అడుగుతాడు. నిజరూపం చూపిన శివుడు వరం కోరుకొమ్మంటాడు. శివుని కరుణకు చలించిన లోభి “నీ దర్శనభాగ్యమైన తర్వాత జీవించాల్సిన అవసంలేదు,నాకు ముక్తిని ప్రసాదించి నా సమాధి పై లింగరూపం లో అవతరించ”మని వేడుకోగా అతని సమాధి పై లింగం వెలయగా కైలాసేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.

    గ్రామంలో ని వారికి ఈ కథ తెలియకున్నా గ్రామ విశేషాలను చెప్పమన్నప్పుడు కొన్ని చెప్పారు.

    మా గ్రామానికి ఒక పక్క బాహుదా నది,ఇతర దిక్కుల్లో కొన్ని వాగులూ,వంకలు ఉన్నందున ఎవరైనా మా గ్రామం లోనికి రావాలంటే(వంతెనలు లేని రోజుల్లో) సహజంగానే పాద ప్రక్షాళన జరుగుతుంది.

    అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవ స్వామిని సేవించాడు.

    చదవండి :  రాజంపేట శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు

    అన్నమయ్యకు ఆశ్రయమిచ్చి,సంకీర్తనలను రాగి రేకులపై చెక్కించిన సాళువ నరసింహరాయల స్వగ్రామం ఇది. ఇదండీ ఈ ఊరి చరిత్ర.

    గ్రామాన్ని వెదకడానికి కష్టపడి,చివరికి నదిలోని ఇసుకలో కిలోమీటర్ నడచి ఈ ఊరు చేరే సరికి చీకటి పడినందున ఎక్కువ ఫోటోలు తీయలేకపోయను.

    టంగుటూరు ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

    – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నంద్యాల శ్రీను)

    (abhiramsrinu@yahoo.co.in)
    (సాక్షి దినపత్రికలో ప్రచురితం)

    [author title=”రచయిత గురించి” image=”https://kadapa.info/gallery/albums/userpics/10001/gopireddy.png”]

    సాహిత్యాభిలాషి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక ప్రదేశాలలో పర్యటించి అయా విశేషాలను వివిధ పత్రికలలో వ్యాసాలుగా రాసినారు. ఆయా యాత్రా విశేషాలకు చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన అరుదయిన విషయాలను జోడించి చెప్పటంలో వీరు నేర్పరి. వీరు భారతదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలనే కాక ఈజిప్టును కూడా సందర్శించినారు. ఈజిప్టుకు సంబంధించిన వీరి యాత్రా విశేషాలను ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ముఖచిత్ర కథనంగా ప్రచురించింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల వీరి స్వస్థలం.ఫోన్ నంబర్: +91 – 9505221122

    [/author]

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *