
ప్రొద్దుటూరులో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
ప్రొద్దుటూరులో కదం తొక్కిన విద్యార్థులు
వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
(ప్రొద్దుటూరు నుండి వనం దత్తప్రసాద్ శర్మ అందించిన ప్రత్యేక కథనం)
రాయలసీమకు రాజధానిని రేపటి స్వాతంత్రోద్యమ వేడుకల్లో ప్రకటించకపోతే 30వ రాష్ట్రంగా రాయలసీమ కోసం ఉద్యమం తప్పదని రాయలసీమ విద్యార్ధి సమాఖ్య (ఆర్.ఎస్.ఎఫ్) కేంద్రరాష్ట్రప్రభుత్వాలను హెచ్చరించింది. రాయలసీమకు ద్రోహం చేస్తే చంద్రబాబును ఈ గడ్డపై తిరగనివ్వమని స్పష్టం చేసింది. నవ్యాంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను చేస్తూ బాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిరశిస్తూ గురువారం ప్రొద్దుటూరులో రాయలసీమ విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపై కదం తొక్కారు. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చూస్తూ ప్రొద్దుటూరులోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్ధిని, విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు.
స్థానిక పుట్టపర్తి సర్కిల్లో మానవ హారం నిర్వహించారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు భాస్కర్ మాట్లాడుతూ, చంద్రబాబు కుట్రలతోనే రాయలసీమను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని మధ్యలో పెట్టాలంటూ మధ్యస్త సూత్రాన్ని చెబుతూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మధ్యలో రాజధానులు లేవని చివరకు దేశ రాజధానికి ఢల్లీి కూడా దేశం మధ్యలో లేదన్నారు. కానీ నవ్యాంధ్ర ప్రదేశ్లోనే ఎందుకు మధ్యస్త సూత్రాన్ని అమలు చేయాలనుకుంటున్నారో అర్ధం కావడంలేదని భాస్కర్ ఎద్దేవా చేశారు. రాయలసీమ నాలుగు జిల్లా మధ్య చిచ్చు పెట్టి, ఒక్కో జిల్లాకు ఒక్కోరకంగా మోసపూరిత మాటలు చెబుతూ రాయలసీమకు రాజధానిని కోరకుండా చేస్తున్నారన్నారు.
తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పడం కూడా కుట్రేనన్నారు. ఇది కూడా కోస్తా జిల్లాలవారు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకే తప్న రాయలసీమ వారిపై ఉన్న ప్రేమతో కాదన్నారు. రాయలసీమలో ఇప్పటి దాకా ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదని తెలిసి కూడా రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ స్పెషాలిటీ ఆసుత్రిని విజయవాడలో ఏర్పాటు చేయడం, అత్యున్నత సంస్థjైున ఇండియన్ మెడికల్ సైన్సెస్ను కూడా అక్కడే ఏర్పాటు చేయాలని చూడటం దారుణమన్నారు.
రాయలసీమలో ఎక్కడా రైల్వే సదుపాయాల్ని మెరుగుపరచకుండా ఢల్లీికి కోస్తానుంచి ప్రత్యేక రైలు మార్గాలు, మెట్రో రైళ్ళు ఏర్పాటు చేస్తూ రాజధానిని రాయలసీమకు కాకుండా తరలించుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారని భాస్కర్ విమర్శించారు.
మంత్రి నారాయణ కూడా రాజధానిని రాష్ట్రం మధ్యలో పెట్టాలని ప్రచారం చేస్తూ, రాయలసీమ వాసులను తీవ్ర గంగరగోళంలోనూ నిరాశలోనూ ఉంచుతున్నారన్నారు. ఒకవైపు కుట్రలు చేస్తూ చంద్రబాబు మరోవైపు రాయలసీమ వాసుల కన్నీళ్ళ తుడిచేందుకు నవ్యాంధ్రప్రదేశ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కొండారెడ్డి బురుజుపై నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇదే వేడుకల్లో రాయలసీమలోనే రాజధానిని పెట్టే అంశాన్ని ప్రకటించాలని భాస్కర్ డిమాండ్ చేశారు. రాజధానిపై ఇకనైనా స్పష్టత ఇవ్వకుంటే రాయలసీమలో 30వ కొత్త రాష్ట్రం కోసం ఉద్యమం రాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం రాయలసీమ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ ఎన్నెస్ ఖలందర్ మాట్లాడుతూ, రాయలసీమపై కుట్రల మీద కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్దంగా రాయలసీమకు రావాల్సిన రాజధానిపై అనవసర రాజకీయాలు, రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాయలసీమలో ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని హెచ్చరించారు. రాయలసీమ విద్యార్ధి వేదిక ప్రొద్దుటూరు కన్వీనర్ కొండారెడ్డి, ప్రొద్దుటూరు ప్రెస్క్లబ్ ప్రింట్మీడియా అధ్యక్షులు వనం శర్మ తదితరులు పాల్గొన్నారు.