
బాలకృష్ణకు జ్ఞాపిక బహూకరిస్తున్న సినిమా యూనిట్ సభ్యులు
లెజెండ్ సినిమా చేయడం పూర్వజన్మ సుకృతం
ప్రొద్దుటూరు: లెజెండ్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్ సినిమా ఒక లెజెండ్గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్ చలనచిత్రం 275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్రం యూనిట్తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతో నైపుణ్యం గల దర్శకుడని లెజెండ్ సినిమాలో రెండు పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్ది సినిమాను గుర్తుండిపోయేలా తీసిన ఘనత దక్కించుకున్నారన్నారు. అద్భుతమైన డైలాగులు, అందరినీ ఒప్పించగలిగే నటనను చిత్రంలోని నటీనటులు అందరితో రాబట్టుకోగలిగారన్నారు. తమ ఇద్దరి కాంబినేషన్లో మరిన్ని విజయవంతమైన సినిమాలు చేస్తామన్నారు. లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో 275 రోజులు ఆడడం ఎంతో గర్వకారణమని అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మంగమ్మగారి మనువడితో ప్రారంభమైన తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. బొబ్బిలిపులి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను చూశామని, అంతకు మించి 275 రోజులు లెజెండ్ విజయోత్సవ పండుగను ఉత్సాహంతో ఉల్లాసంతో ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు మళ్లీ పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. అభిమానులంతా ఆదర్శంగా ఉండాలని, ఇతరులకు సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు వెళ్లాలన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ రాయలసీమ వాసులు మమకారాన్ని పంచుతారన్నారు. నచ్చితే నెత్తికెత్తుకుంటారని, లేదంటే విసిరికొడతారన్నారు. నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినా అభిమానులు ఎంతో ఓపికతో తమ సభను ఆదరించడం అదృష్టమన్నారు. దారి పొడవునా ప్రజలు తమను అభిమానంతో అడ్డుకున్నారని, అందుకే ఆలస్యమైందని ఈ సందర్భంగా క్షమించాలని ఆయన సభికులను కోరారు. లెజెండ్ సినిమాను చాలెంజ్గా చేసుకుని తీశామన్నారు. ఆ పాత్రకు బాలకృష్ణనే తగిన హీరోగా భావించి సాహసం చేశామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు.

నటుడు చలపతిరావు మాట్లాడుతూ పవర్ఫుల్ డైలాగ్లు చెప్పడం ఒక్క బాలకృష్ణకే సాధ్యమన్నారు. రాయలసీమలో రికార్డుస్థాయిలో 275 రోజులపాటు ఆడడం చరిత్ర సృష్టించడమేనన్నారు. మరో నటుడు సమీర్ మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్తో కలిసి నటించాలన్న కోరిక బాలయ్యతో నటించడంతో తీరిందన్నారు.
మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఒక చైతన్యవంతమైన సినిమా తీసి ప్రభుత్వం ఏర్పాటుకు బాలకృష్ణ కృషి చేశారన్నారు. నీవు భయపెడితే భయపడేందుకు ఓటర్ను కాదు… షూటర్ను అనే పంచ్ డైలాగ్ ప్రేక్షక హృదయాల్లో శాశ్వతంగా ఉంటుందన్నారు.
తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం 275 రోజులు ప్రదర్శించబడడం గర్వకారణమన్నారు.
రచయిత రత్నం, యూనిట్కు చెందిన రాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. మొదటగా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడిన అర్చన థియేటర్ యజమాని ఓబుళరెడ్డికి 275 రోజుల షీల్డ్ను పంపిణీ చేశారు. అలాగే ఎమ్మిగనూరు, కర్నూలు, గుంతకల్లు తదితర థియేటర్ల యజమానులకు షీల్డ్లను బహూకరించారు.
బాలకృష్ణ అభిమాన సంఘాలు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున బాలకృష్ణకు సన్మానాలు చేసి షీల్డ్ను బహూకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం చిత్రంలోని యూనిట్ సభ్యులకు, నిర్మాతలకు, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి 275 రోజుల విజయోత్సవ షీల్డ్ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని తెదేపా నాయకులు, బాలయ్య అభిమానులూ పాల్గొన్నారు.
ప్రమాదంలో అభిమాని మృతి
లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానుల బైకునును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.
1 Comment
Ee cinema choodakapovadam maa ee janma sukrutham. Ledante balayye vaallam.