రాయలసీమ బిడ్డలారా.. ఇకనైనా మేల్కోండి

    రాయలసీమ బిడ్డలారా.. ఇకనైనా మేల్కోండి

    ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది.

    తొలి బస్సు మిస్సయ్యాం. మిగిలిపోయిన రెండో బస్సునైనా అందుకోకుంటే సర్కార్ జిల్లాల ఉక్కుపాదం కింద మన జీవితం నలిగిపోవడం ఖాయం. వాళ్ళ సహవాసం ఇదివరకే చవిచూసినవాళ్ళం. తాగునీటి కోసం, సాగునీటి కోసం, బడుగు జీవితాల భద్రత కోసం, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం మొగం వాచిన మేకపిల్ల వంటి రాయలసీమ తేరగా కఠినుల చేతికి చిక్కిపోతుందా లేక చురుకుతో ప్రాణాన్ని కాపాడుకుంటుందా అనేది కట్టెదుట సాకారమై నిలిచిన ప్రశ్న.

    చదవండి :  ప్రాంతాల మధ్య కాదు, ప్రాంతాలలోనే అసమానతలు

    బారలు బారలు మీసాలు పెంచుకుని బడా కాంట్రాక్లర్లతో కమీషన్లు ఆశించే ఫ్యాక్షనిస్టులుగాదు దీనికి సమాధానం వెదకవలసింది. రియల్ ఎస్టేట్లతో తలమునకలైనోళ్ళూ, బస్సు పర్మిట్ల బుకాయింపుల్లో కరెన్సీ కట్టలు చూసుకునే వాళ్ళూ కాదు దీన్ని తలపోయవలసింది. తమ పరపతిని పురిటిగడ్డ ప్రయోజనానికి వినియోగించే మనసే వాళ్ళకుంటే కన్నతల్లి ని నిట్టనిలువునా చీల్చేయమని అడిగేకంటే, సాగునీటివాటా అడిగుండేవాళ్ళు, కోస్తావారు కాజేసిన ఉద్యోగాలను వాపసు ఇమ్మని అడిగుండేవాళ్ళు, వెనకబడిన సీమ కోసం ప్యాకేజీ అడిగుండేవాళ్లు, విశాలాంధ్ర ఉబలాటంలో కోల్పోయిన రాజధాని కావాలని అడిగుండేవాళ్ళు.

    కానీ 1953 నుంచి సమర్థుడైన నాయకులు ఏ ఒక్కరైనా కనిపించాడా మనకు? ఏ కొరనోము నోచిందోగానీ, రత్నాలకు దీటైన బిడ్డలతో విలసిల్లే మన కన్నతల్లి, సెర్చిలైట్లతో వెదికినా ప్రపంచంలో ఎక్కడగానీ, కనిపించనంతటి నికష్టపు రాజకీయ నాయకులకు జన్మనిచ్చింది. గద్దెమీద వాళ్ళకున్న మోజు కోసం సిద్ధేశ్వరం ప్రాజెక్టును చేతులారా వదులుకున్నారు.

    చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

    తమ పెత్తనం సిటీలో ప్రదర్శించాలనే వాళ్ళుపడిన తాపత్రయం కోసం కర్నూలు రాజధానిని అటకెక్కించి మనదిగాని నగరంలో వలస నివాసం అనుభవించాం. ప్రాంతీయ స్పహతోపాటు అసెంబ్లీలో అత్యధిక స్థానాలుండే దాయాదులను తలపడం కోసం రాష్ర్టానికున్న వనరులన్నీ దాయాదుల లోగిట్లో గుమ్మరించి రాయలసీమను ఎడారిగా మార్చారు.

    ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా ఓ కాలం నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది. తమ పెద్దలిచ్చిన హమీలకు ఈనాటి సర్కారు నాయకులు కట్టుబడగలరో లేదో తేల్చుకోవలసిన మలుపు రాయలసీమ జీవితాలకు తటస్థమైంది.

    చదవండి :  'వాళ్ళు సీమ పేరు పలకడానికి భయపడుతున్నారు'

    సంపన్నమైన రాయలసీమ బతికుండగానే చూసుకునేందుకు, ఇంతకాలం ఎగవేసిన మొండి బాకీని వసూలు చేసుకునేందుకు, రాయలసీమ బిడ్డలు సర్కార్ జిల్లాలను సవాలు చేయవలసిన అదును అనుకోకుండా ఏర్పడింది. తల్లి రుణం తీర్చుకోవాలనే తపన గలిగిన బిడ్డలతో వెంటనే రాయలసీమ మహాసభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా సంకల్పానికి చేదోడుగా నిలిచే రాయలసీమ బిడ్డలు తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నాము.

    – ఎం.వి. రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *