శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయిందిలా!

శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయిందిలా!

యనమల రామకృష్ణుడు గారు 2016 -17 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ శాసనసభలో ప్రవేశ పెడుతూ చేసిన ప్రసంగంలో “గోదావరి, క్రిష్ణా జిల్లాల ప్రాంతమంత 160 సంవత్సరాల క్రితం దుర్భర దారిద్ర్యములో ఉండేదని, సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడు ధవలేశ్వరం మరియు విజయవాడల దగ్గర బ్యారేజిల నిర్మాణం చేయడం వలన ఆ ప్రాంతాలు ధాన్యాగారాలుగా మారాయి” అని వివరించారు.

అదేవిధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి రాయలసీమను ధాన్యాగారంగా మారుస్తుందని చెప్పారు. గోదావరి నదిని క్రిష్ణానదితో అనసంధానించడం ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి నీటిని అందించి తద్వారా ఆదా అయిన కృష్ణా జలాలను రాయలసీమకు మల్లించడం ద్వారా సీమను రతనాలసీమగా మారుస్తామని రామకృష్ణుడు గారు వివరించారు.

అంతేకాకుండా కార్యదీక్షాపరుడైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ద్వార గోదావరి కృష్ణా నదుల అనుసందానం ఒక్క సంవత్సరం కాలంలో పూర్తి చేసిందని వివరించారు. గోదావరి నదిని పట్టుసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేయడం వలన కృష్ణా డెల్టాకు 80 టియంసిల నీరు లభిస్తుందని చెప్పారు.

చదవండి :  బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

ఈ నేపధ్యంలో రాయలసీమ వాసులు ముఖ్యంగా తెలుసుకొనవలసిన విషయం కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటీ కేటాయింపులు ఎన్ని ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుందని. కృష్ణా డెల్టా(ప్రకాశం బ్యారేజీ నుండి సాగునీటిని పొందే ప్రాంతాలు)కు నీటికేటాయింపులు 181.20 టీ. యం. సిలు. అందులో 101.20 టి.యం.సిలు  నాగార్జన సాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజి మధ్యన ఉన్న నీటివనరు  ప్రాంతం (Catchment Area) నుండి లభించే నీటిని కేటాయించారు. అంటే సాగర్, ప్రకాశం బ్యారేజీల నడుమ కురిసే వర్షాల కారణంగా ఈ 101.2 టి.ఎం.సిలు లభిస్తాయని లెక్కగట్టారు. మిగిలన 80 టీ.ఎం.సిలు నాగార్జునసాగర్ నుండీ కేటాయించారు. ఈ 80 టి.యం.సిల నీరు శ్రీశైలం నుండి నాగార్జనసాగర్ కు విడుదల అవుతుంది.

చదవండి :  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

అంటే శ్రీశైలం నుండి విడుదల చేయడం వలన కృష్ణా డెల్టాకు లభించే నీరు నేడు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు లభిస్తుంది. అందువలన కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి చక్క నీరు కూడా విడుదల చేయవలసిన అవసరం లేదు. ఇంకొక విదంగా చెప్పాలంటే శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం వారు తమ బడ్జట్లో ప్రకటించినట్లుగ రాయలసీమను రతనాలసీమగా మార్చే సువర్ణ అవకాశం వారికి లభించింది. దానికి వారు కార్యోన్ముఖులై నదుల అనుసంధానం వలన మిగిలన 80 టి.ఎం.సిలలో కర్నాటక, మహరాష్ట్రల  వాటా 35 టీ.యం.సీలు పోను మిగిలిన 45 టి.యం.సి.లు రాయలసీమ సాగునీటి పథకాలైన హంద్రీ – నీవా, గాలేరు – నగరి ప్రాజక్టులకు చట్టబద్దంగా కేటాయించాలి.

చదవండి :  రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

శ్రీశైలం జలాశయం నీటి విడుదల విధానంలో సమూలమైన మార్పులు చెయ్యాలి. శ్రీశైలం ప్రాజక్టు కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్దరించాలి. యస్.అర్.బి.సి, హంద్రీ – నీవా, గాలేరు – నగరి ప్రాజక్టులకు ప్రధమ ప్రాధాన్యతతో నీటిని విడుదల చేసేలాగా విదానాలు రూపొందించి రాయలసీమను రతనాలసీమగ మార్చాలి.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకొని రాయలసీమ ప్రజల మనసులో శాశ్వత స్థానం పొందాలి. చంద్రబాబు నాయుడు గారు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకొన లేకపోతే ఇతర రాజకీయపక్షాలు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని నిరసనలు, నిరాహర దీక్షల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పిస్తే, ఆ రాజకీయపక్షం రాయలసీమ ప్రజల మనసులో శాశ్వత స్థానం పొందుతుంది.

మరి ఈ అద్భుత అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో తేల్చుకోవలసిందో రాజకీయ పార్టీలే!

– బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *