ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. రాష్ట్ర విభజన రెండుముక్కలాటే అని కాంగ్రెస్ అధినేత్రి ఏకపక్షంగా తేల్చేశారు. ఆ మధ్య ఒక వ్యాసంలో సీనియర్ పాత్రికేయులు ఎం.జె. అక్బర్ చెప్పినట్లు దేశం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నపుడు, ప్రభుత్వం విఫలమైనపుడు వాటి తాలూకు ప్రతిస్పందనలు, ఆందోళనలు జనబాహుళ్యం పైన ప్రభావం చూపుతున్నదని తెలిసిన మరుక్షణం, అదీ ఎన్నికలకు సిద్దమవుతున్న సందర్భంలో వాటిని పక్కదారి పట్టించడానికి మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం చేయడం కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఏ ప్రభుత్వానికి అలవాటే. ఆ అలవాటు నుండి వెలువడిందే ఈ అసంబద్ధ, అసంపూర్తి ప్రకటన.

దేశంలో ద్రవ్యలోటు పెరిగిపోతుండడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, రూపాయి పతనమవుతుండడం, చైనా చొరబాట్లకు పాల్పడుతుండడం వంటి అత్యంత ప్రాధాన్యమైన సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన తరుణంలో తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చి పరిష్కారానికి బదులుగా విద్వేషాలు రగిల్చిన డిల్లీ పెద్దలు, వారికి బాకాలూదిన రాష్ట్రనేతలు ఇపుడు చోద్యం చూస్తుండడం విపత్కర పరిణామం.

కొంతమంది మేధావులు చెప్పినట్లు చాలా కాలంగా నలుగుతున్న ఈ సమస్యను కాంగ్రెస్ ఒక కొలిక్కి తెచ్చిందా! నాకు తెలిసినంత వరకూ తెలంగాణా ఇస్తున్నామని అప్పుడెప్పుడో (డిసెంబర్ 9 ప్రకటన) చేసిన ప్రకటననే తిరిగి మళ్ళీ చదివేశారు. కాకపొతే హైదరాబాదు గురించి రెండు ముక్కలు జత చేశారు. పనిలో పనిగా జల వివాదాలు అన్నారని పోలవరానికి జాతీయ హోదా ఇస్తున్నాం అని చెప్పేశారు. మరి దీనికోసం ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు? శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేసినట్లు? శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు పక్కన పెట్టినట్లు?

చదవండి :  ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

తెలంగాణ ఇచ్చే పక్షంలో మా పరిస్తితి ఏంటి అన్న ఇతర ప్రాంతాల వారి ఆక్షేపణలను పట్టించుకున్న దాఖలాలు కాగ్రెస్ విధాన ప్రకటనలో కనపడకపోవడం శోచనీయం. తెలంగాణా సమస్యను పరిష్కరించొద్దని ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రకటనలో తెలంగాణ వాసుల డిమాండ్ నెరవేరినట్లే కనిపిస్తుంది. అదే సమయంలో కోస్తా, రాయలసీమ వాసుల సమస్యలను లేదా అభ్యంతరాలకు పరిష్కారాల చూపకుండా వదిలేసింది – కొట్టుకు చావండి అని.

కోస్తా లేదా సీమ నాయకులు ఇప్పటివరకూ విభజన వద్దు అన్నట్లుగానే చెప్పేవారు. ఇప్పుడు కూడా అక్కడి ప్రజలు సమైఖ్యాంధ్ర అంటూ ఉద్యమం చేస్తున్నారు. అసలు సమస్యంతా విభజన మొదలవుతున్నప్పుడు ఉంటుంది. సీమ వాసులు కోస్తా వారితో కలిసుండం అంటారు. ఎందుకూ అంటే అధిక సంఖ్యలో ఉన్న కోస్తా నాయకులు తమను విస్మరిస్తారన్న భయం. ఇందుకు శ్రీభాగ్ ఒప్పందం పెద్ద ఉదాహరణ. రాజధాని విషయంలో కూడా వివాదం మొదలవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి కర్నూలులో రాజధాని ఉండేది. అదే మాదిరి ఇప్పుడు కొత్త రాష్ట్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి అని డిమాండ్ వస్తుంది. కోస్తా నాయకులు ఈ విషయాన్ని అంత తేలికగా ఒప్పుకోకపోవచ్చు. ఉత్తరాంధ్ర నాయకులు కూడా రాజదాని విశాఖ లో ఏర్పాటు చేయాలని అడగొచ్చు. అప్పుడు మళ్ళీ రెండు ప్రాంతాలలో మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది. ఒకరి నిర్ణయాన్ని మరొకరు అంగీకరించే పరిస్తితి ఉండదు. రాయలసీమ వాసులు, కోస్తా వాసులు తన్నుకు చావాలి.

చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

ఈ విషయాలు కాంగ్రెస్ కు తెలియవా? తెలుసు. అందరికన్నా వాళ్లకు ఈ విషయంపై బాగా అవగాహన ఉంది. కాబెట్టే వాళ్ళు ఈ విషయాన్ని అలా వదిలేశారు. అందువల్ల వాలు లాభపడేది ఏమిటి? అదే రాజకీయం అంటే – తెలంగాణ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో దెబ్బ తగులుతుందనే విషయం సోనియా&కోకు బాగా తెలుసు. అలాగే సమస్యలను పరిష్కరించుకోలేక అక్కడి వారు తగవులకు దిగుతారని తెలుసు. సీమంద్ర ప్రజలు, నాయకులు ప్రాంతాల వారీ, పార్టీల వారి విడిపోతారు. ఈ తగవుల్లో ఆయా పార్టీలను బలహీనపరిచి పరిష్కరిస్తామని కాంగ్రెసోళ్లు రంగంలోకి దిగుతారు – ప్యాకేజీలు, లేకేజీలతో. మళ్ళీ ఈ సమస్యల పరిష్కారం కోసం మనోళ్ళు డిల్లీ యాత్రలు చేయాలి.

చదవండి :  ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

ఇదంతా చేయటం వళ్ళ వాళ్లకు కలిగే లాభం? వెదికితే 2014 ఎన్నికలలో సమాధానం దొరుకుతుంది. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెసొల్ల విన్యాసాలు చూశాం. ఇక మీదట సీమాంధ్ర కాంగ్రెస్ వంతు.

2014 నాటి ఎన్నికల కోసం వ్యూహ రచన చేస్తూ రాజకీయాలలో అపరాచాణక్యుడుగా పేరు గాంచిన చంద్రబాబు సీమాంధ్ర రాజధాని కోసం 5 లక్షల కోట్ల డిమాండ్ చేశారు గాని డిల్లీ వీధుల పాలైన మన భవిష్యత్ ను గురించి, కాంగ్రెస్ కుటిల ఎత్తుగడను గురించి గాని మాట్లాడకపోవడం శోచనీయం.

వార్తా విభాగం

ఇవీ చదవండి

1 Comment

  • అమ్మా ఇటలీ దేవతా! నీ కళ్ళు చల్లపడ్డాయా తల్లీ. మేమిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా బతుకులు బుగ్గి పాలు చేస్తున్నావు కదమ్మా! నువ్వు ఇంతకింతా అనుభవిస్తావు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: