కడప జిల్లాలో నిజాం మనువడి హత్య

ఫ్రెంచి గవర్నరు డూప్లె, ముజఫర్ జంగ్ ల సమావేశం

కడప జిల్లాలో నిజాం మనువడి హత్య

భారతదేశపు దూర దక్షిణ ప్రాంతానికి కర్నాటకమని పేరు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కర్నాటక యుద్ధాలుగా పేరు పొందాయి. భారతదేశంలో ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ భవితవ్యమును ఈ కర్నాటక యుద్ధాలే నిర్ణయించినాయి. ఈ యుద్ధాలే ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది.

క్రీ.శ.1748-56 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ కర్నాటక యుద్ధంలో కడప నవాబు మౌసింఖాన్ (మూచామియా), కర్నూలు నవాబు  హిమ్మత్ బహదూర్ ఖాన్ లు పాల్గొని అనేక రాజకీయ హత్యలకు కారణమైనారు.

అన్వరుద్దీన్
అన్వరుద్దీన్

దక్కన్ ప్రాంత అధిపతి నిజాం – ఉల్ – ముల్క్ అసఫ్ జా (ఖమరుద్దీన్ ఖాన్) క్రీ.శ. 1744లో కర్నాటకంను జయించి అన్వరుద్దీన్ ను గవర్నర్ గా నియమించినాడు.

నిజాం చనిపోవడంతో అతని ఐదవ కొడుకు నాసిర్జంగ్ (మీర్ అహ్మద్ అలీ ఖాన్) దక్కన్ పాలకుడయ్యాడు. ఈ నిర్ణయం రుచించని నిజాం ఉల్ ముల్క్ మనవడు (నిజాం కుమార్తె ఖైరున్నిసా బేగం, బీజాపూర్ సుబేదార్ తలిబ్ ముహిద్దిన్ ముతవస్సిల్ ఖాన్ ల కుమారుడు) ముజఫర్ జంగ్ ఎలాగైనా దక్కన్ సుబేదారు కావాలని ఆశించాడు. అప్పటికే తండ్రి మరణించడంతో ముజఫర్ జంగ్ బీజాపూర్ సుబేదార్ గా కొనసాగుతున్నాడు. కానీ అప్పటికే నిజాం అహ్మద్ అలీ ఖాన్ ను వారసుడుగా ప్రకటించడంతో ముజఫర్ జంగ్  దక్కన్ పీఠాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అవసరమైతే మామ నాసిర్ జంగ్ పై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.  ఇందుకోసం ఫ్రెంచి గవర్నర్ డూప్లె, నాటి ఆర్కాట్ పాలకుడైన చందా సాహెబ్ (ఇతడు అన్వరుద్దీన్ ప్రత్యర్థి)లను సహకారం కోరాడు.

చదవండి :  గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు

ముజఫర్ జంగ్ – ఫ్రెంచి, ఆర్కాటు నవాబు చందాసాహెబ్ ల సాయంతో  అన్వరుదీన్ ను ఓడించి కర్నాటకంపైన ఆధిపత్యం నిలిపినాడు. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ కు ఆంగ్లేయులు సహకారమందించారు. ఈ పరాజయానికి బదులు తీర్చుకోవాలని నిజాం నవాబుగా ఉన్న నాసిర్ జంగ్ (ముజఫర్ జంగ్ మామ) ఆంగ్లేయుల సహకారంతో క్రీ.శ 1750 లో కర్నాటకంపైన దండెత్తినాడు. ఈ యుద్ధ్దంలో పాల్గొనడానికి తన సామంతులైన కడప, కర్నూలు, సావనూర్ నవాబులను సైన్యంతో సహా తరలి రమ్మని నాసిర్ జంగ్ ఆదేశించినాడు. ఈ యుద్ధంలో నాసిర్ జంగ్ ఫ్రెంచి వారిని, ముజఫర్ జంగ్ ను ఓడించినాడు.

చదవండి :  కడప జిల్లాలో రేనాటి చోళులు - 1

యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రెంచి గవర్నర్ డూప్లె తన భార్య సలహా మేరకు కడప, కర్నూలు నవాబులను తనవైపు తిప్పుకొన్నాడు. కడప, కర్నూలు నావాబుల సహాయంతో ఫ్రెంచి సేనాని ‘లాటూష్’ నాసిర్ జంగ్ ను హత్య చేశాడు. వెంటనే డూప్లె ముజఫర్ జంగ్ ను దక్కను సుబేదార్ గా ప్రకటించి, ఫ్రెంచి సేనాని బుస్సీ సంరక్షణలో ముజఫర్ ను హైదరాబాద్ పంపినాడు.

మార్గమధ్యంలో రాయచోటి – గువ్వలచెరువు కనుమ సమీపమున కడప నవాబు మౌసిం ఖాన్, కర్నూలు నవాబు బహదూర్ ఖాన్ లు కలిసి ఫిబ్రవరి 13, 1751న ముజఫర్ జంగ్ ను హత్య చేసినారు. ఈ గొడవలో కర్నూలు నవాబు సైతం మరణించడం విశేషం.

చదవండి :  1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం ...

ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ కుట్రలకు సజీవ సాక్ష్యంగా ఉన్న ముజఫర్ జంగ్ సమాధిని లక్కిరెడ్డిపల్లెలో ఇప్పటికీ చూడవచ్చు.

కడప నవాబు మౌసిం ఖాన్ ను ఆ తర్వాత సిద్దవటం పాలకుడు ఓడించి బందీ చేసినాడు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: